
పట్టపగలే భారీ చోరీ
● 60 తులాల బంగారం,
రూ. 27 లక్షల నగదు అపహరణ
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా నగర్లో సోమవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్గా ఉన్న శరభారెడ్డి ఇంటిని దొంగలు లూటీ చేశారు. దాదాపు 60 తులాల బంగారు ఆభరణాలు, రూ. 27 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇటీవల శరభారెడ్డి కుమార్తె వివాహం జరిగింది. కాగా నల్లకాల్వ సమీపంలో ఉన్న వైఎస్సార్ స్మృతివనంలో పోస్ట్ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఉదయం కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉంచిన నగదు, బంగారు ఆభరణాలు అపహరించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోస్ట్ వెడ్డింగ్ ఫొటో సెషన్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న కుటుంబీకులు ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ రాము సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ను రప్పించి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.