
26 ఎకరాలైనా చూపించండి... తల్లికి వందనమైనా ఇప్పించండి!
కోడుమూరు రూరల్: ‘ నా ముగ్గురు పిల్లలకు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద డబ్బులు రాలేదు. కారణం అడిగితే 26 ఎకరాల పొలముందంటూ చెబుతున్నారు.. డబ్బులైనా ఇప్పించండి.. లేదా పొలమైనా చూపించండంటూ’ కోడుమూరుకు చెందిన గాయత్రి అనే మహిళ అధికారులను వేడుకుంటోంది. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ నాగరాజుకు మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు నలుగురు సంతానం కాగా, ముగ్గురు కుమార్తెలు, రెండేళ్లలోపు ఒక బాలుడు ఉన్నారన్నారు. ఇందులో ముగ్గురు కుమార్తెలు ప్రస్తుతం 1, 4, 5వ తరగతులు చదువుతున్నారన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం డబ్బులు జమ కాలేదన్నారు. విషయం తెలుసుకోగా తమ కుటుంబం పేరు మీద 26 ఎకరాల భూమి ఉన్నట్లుగా చూపిస్తోందని, దీని వల్ల తమకు తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదని వాపోయారు. తమ పేరు మీద కేవలం ఎకరా 85 సెంట్ల భూమి మాత్రమే ఉందని, అధికారులు చర్యలు తీసుకుని తమకు తల్లికి వందనం పథ కం వర్తించేలా చూడాలని ఆమె తహసీల్దార్తో మొరపెట్టుకున్నారు. గాయత్రి ఇచ్చిన అర్జీని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నాగరాజు తెలిపారు.