
సుంకేసులకు స్వల్పంగా పెరిగిన వరద
కర్నూలు(సిటీ): తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతం, జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కురిసిన వర్షాలకు తుంగభద్ర నదికి బుధవారం వరద నీటి ప్రవాహం పెరిగింది. ఉదయం 9 గంటలకు 13,395 క్యూసెక్కుల వరదనీరు సుంకేసుల బ్యారేజీలోకి వచ్చి చేరగా 4 క్రస్టు గేట్లు మీటరు పైకెత్తి 13,236 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు బ్యారేజీలోకి వరదనీటి ప్రవాహం కొంత తగ్గింది. 8,917 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉండగా 2 గేట్లు మీటరు పైకెత్తి 8,758 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 159 క్యూసెక్కుల నీరు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని తాగునీటి అవసరాల నిమిత్తం కేసీ కాలువకు విడుదలవుతోంది.
తుంగభద్రకు..
నందవరం: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ, తీర్థనహళ్లి, ఆగుంబే, బళ్లారి, వరినాడు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుడడంతో తుంగభద్ర నదికి వరద నీరు వస్తోంది. బుధవారం మండల పరిధిలోని నాగలదిన్నె గ్రామంలో బ్రిడ్జి వద్ద తుంగభద్ర నది వరద నీరు ప్రవాహం పెరిగింది. నదీకి వరద నీరు రావడంతో రైతులు ఖరీఫ్ సాగు సన్నద్ధమవుతున్నారు.