కొనుగోళ్లు మూరెడు..కష్టాలు బారెడు | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు మూరెడు..కష్టాలు బారెడు

May 5 2025 9:04 AM | Updated on May 5 2025 9:04 AM

కొనుగోళ్లు మూరెడు..కష్టాలు బారెడు

కొనుగోళ్లు మూరెడు..కష్టాలు బారెడు

నంద్యాల(అర్బన్‌): కొనుగోళ్లు మూరెడు.. కష్టాలు బారెడులా తయారైంది జొన్న రైతుల పరిస్థితి. ఒకపక్క అరకొర కొనుగోలు కేంద్రాలు.. మరోపక్క సరుకు బాగోలేదంటూ వెనక్కు పంపుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 30 వేల మెట్రిక్‌ టన్నుల జొన్నలను మద్దతు ధర రూ.3,371తో కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా నందికొట్కూరు, ఆళ్లగడ్డ, గడివేముల, నంద్యాలలో రెండు కేంద్రాల్లో కొనుగోళ్లకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రస్తుతానికి రైల్వే స్టేషన్‌ సమీపంలోని సీడబ్ల్యూసీ గోడౌన్‌లో కొనుగోళ్లను చేపట్టారు. ఒకే గోడౌన్‌లో కొనుగోళ్లు జరుగుతుండటంతో జిల్లావ్యాప్తంగా వస్తున్న జొన్న పంట దిగుబడులను కొనుగోలు చేయడం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. మరోవైపు రైతులు రోజుల తరబడి వేసిచూడాల్సి వస్తోంది. ఈక్రమంలో శనివారం నుంచి సెంట్రల్‌ వేర్‌హౌస్‌కు సరుకు తీసుకు రావద్దని, దీబగుంట్ల గోడౌన్‌కు తీసుకెళ్లాలని గోడౌన్‌ అధికారులు హడావుడిగా సమాచారం ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఉంటే వాహనాల రవాణ బాడుగలు రెండింతలు భరించాల్సి వస్తుందంటూ అన్నదాతలు నిట్టూర్చారు.

నాణ్యత లేవంటూ వెనక్కి..

జొన్నలు జల్లెడ పట్టలేదని, నాణ్యత లేవంటూ సిబ్బంది కొంత మంది రైతులను వెనక్కిపంపుతున్నారు. గోడౌన్లు, సంచుల కొరత తీవ్రంగా వేధిస్తుండటం, కొనుగోళ్లు ఆలస్యమవుతుండటంతోపాటు నాణ్యత లేవంటూ వెనక్కి పంపుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇదే సమయంలో కొందరు సిఫార్స్‌ ఉన్న రైతుల నుంచి మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ట్రాక్టర్‌ను లోపలికి అనుమతించే గోడౌన్‌ సిబ్బందికి రూ.500, సెక్యూరిటీకి రూ.50 ఇచ్చుకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో

సకాలంలో కొనుగోళ్లు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జొన్నలను అధికారులు సకాలంలో కొనుగోలు చేసేవారు. జనవరి నుంచి ప్రారంభించి మార్చి చివరిలోపే జిల్లాలోని రైతులందరితో కొనుగోళ్లు పూర్తి చేసేవారు. మొదట కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జొన్న కొనుగోళ్లు జరిగాక.. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల వద్ద ఉన్న మొత్తం జొన్నల కొనుగోళ్లు జరిగేవి. గ్రామాలు, మండలాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే గాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కల్లాల వద్దే రైతుల నుంచి కొనుగోళ్లు జరిగేవి. కూటమి ప్రభుత్వం మాత్రం రైతన్నలను ముప్పుతిప్పలు పెడుతోంది.

బాడుగ ఖర్చు పెరుగుతోంది

రోజుకు ట్రాక్టర్‌ బాడుగ రోజుకు రూ.2 వేలు. వారం రోజుల క్రితం జొన్నలను విక్రయించేందుకు తెచ్చాను. ఇంకా కొనుగోలు చేయలేదు. ఎన్నిరోజులవుతుందో తెలియదు. అధికారులు రేపుమాపు అంటున్నారు. ట్రాక్టర్‌ బాడుగలు పెరిగిపోతున్నాయి. కేంద్రాలను మరిన్ని పెంచి త్వరగా కొనుగోలు చేయాలి.

– వెంకటేశ్వరరెడ్డి, కరిమద్దెల, గడివేముల(మం)

రోజుకు 15వేల టన్నులు కొంటున్నాం

జిల్లాకు సంబంధించి 30వేల మెట్రిక్‌ టన్నుల జొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇప్పటి వరకు 5వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం. వరుస క్రమంలోనే కొనుగోళ్లు చేస్తున్నాం. అవినీతికి ఆస్కారమే లేదు. హమాలీలు, గోడౌన్లు, గన్నీ బ్యాగ్‌ల కొరత ఉంది. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్రాలు పెంచితే రైతులు వేచి చూడాల్సిన పని ఉండదు.

– రాజునాయక్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం, నంద్యాల

జొన్న కొనుగోలు కేంద్రాలు అస్తవ్యస్తం

సరుకు బాగోలేదంటూ

వెనక్కి పంపుతున్న సిబ్బంది

నత్తనడకన కొనుగోలు ప్రక్రియ..

రోజుల తరబడి రైతుల నిరీక్షణ

ట్రాక్టర్ల బాడుగలు అధికమవుతు

న్నాయంటూ అన్నదాత ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement