నెలకు లక్ష సిలిండర్లు రీఫిల్
నల్లగొండ : ఇరాన్ – ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం భారత్లో వంట గ్యాస్ మంట పుట్టిస్తోంది. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా తగ్గింది. దీంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చమురు సంస్థలు ఈ నెల 6వ తేది అర్ధరాత్రి నుంచి వంటగ్యాస్ ధరలు పెంచేశాయి. మరోవైపు వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సరఫరాను నిలిపేశాయి. దీంతో జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బుకింగ్ గడువు పెంపు..
గ్యాస్ బుక్కింగ్ సరఫరాకు సంబంధించిన వెబ్సైట్లు ఈ నెల 6వ తేది అర్ధరాత్రి నుంచే డీలర్ల పరిధి నుంచి చమురు సంస్థల అజమాయిషిలోకి వెళ్లాయి. గృహ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసేందుకు గడువును 21 నుంచి 25 రోజులకు పెంచారు. ఈ వ్యత్యాసం రానున్న రోజుల్లో 30 నుంచి 35 రోజులకు పెరిగే అవకాశం ఉందని డీలర్ల అంచనా వేస్తున్నారు. బుక్ తర్వాత డెలివరీకి వారం, పది రోజులు పట్టే అవకావం ఉంటుంది. దీంతో గ్యాస్ను పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే..
జిల్లాలో ప్రధానంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నకిరేకల్, చిట్యాల పట్టణాల్లో పెద్ద హోటళ్లు ఉన్నాయి. వీరు నేరుగా అర్డర్ల ద్వారా సంబంధిత డీలర్ల నుంచి వాణిజ్య సిలిండర్లను తెచ్చుకుంటారు. కొందరు రెండు మూడు రోజులకు సరిపడా నిల్వ ఉంచుకుంటారు. కానీ, ప్రస్తుతం సిలిండర్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా కట్టెల పొయ్యిగాని, వరిపొట్టు పొయ్యిని ఏర్పాటు చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
వారం నుంచి పెరిగిన బుకింగ్
జిల్లాలో వారం రోజుల నుంచి వంట, కమర్షియల్ గ్యాస్ గాని బుకింగ్లు పెరిగాయి. ప్రస్తుతం పెరిగిన ధరలతో పాటు మారిన విధానంతో రెండు మూడు రోజులుగా మరింతగా బుకింగ్లు పెరుగుతున్నాయి. కాగా ఈ కేవైసీ లేకుండా గ్యాస్ బుకింగ్ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో డీలర్ల వద్దకు వెళ్లి ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంది.
ఫ పెరిగిన గృహ, వాణిజ్య గ్యాస్ ధరలు
ఫ జిల్లాలో 4,84,104 గ్యాస్ కనెక్షన్లు
ఫ ప్రజలపై రూ.60 లక్షల
అదనపుభారం
జిల్లాలో ఇండేన్, భారత్, హెచ్పీ గ్యాస్ డీలర్లు ఉన్నారు. ఆయా డీలర్ల పరిధిలో 4,84,104 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం గృహ సిలిండర్ ధర ఈ నెల 6 నుంచి రూ.60లు పెరగడంతో ప్రస్తుతం వంట గ్యాస్ ధర 14 కిలోల సిలిండర్కు రూ.984కు చేరింది. వాణిజ్య గ్యాస్ ధర 19 కేజీల సిలిండర్కు రూ.2,100కు చేరినా సరఫరా నిలిచింది. ప్రస్తుతం జిల్లాలో ప్రతినెలా లక్ష వరకు గ్యాస్ సిలిండర్లు రీఫిల్ అవుతున్నాయి. దీంతో నెలలకు రూ.60 లక్షల వరకు అదనపు భారం పడనుంది.


