రేషన్ డీలర్ల నియామకమెప్పుడో!
నల్లగొండ: కొత్త రేషన్ షాపులకు డీలర్ల నియామకంపై సందిగ్ధం నెలకొంది. జిల్లాలో కొత్తగా 54 రేషన్ షాపుల ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయినప్పటికీ ఇప్పటి వరకు డీలర్ల నియామకంలో మాత్రం ముందడుగు పడటం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 997 రేషన్ షాపులు ఉండగా వాటి ద్వారా 4.87 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది.
2015లో కొత్త పంచాయతీలు ఏర్పడినా..
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2015లో కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. పంచా యతీలైతే ఏర్పడ్డాయి కానీ, వాటిల్లో కొత్త రేషన్ షా పుల ఏర్పాటు చేయొద్దని, తద్వారా తమకు నష్ట జరగుతుందని డీలర్ల సంఘం ప్రభుత్వానికి విన్నవించింది. దీంతో అప్పట్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ షాపులకు డీలర్ల నియామకాన్ని పక్కన బెట్టింది.
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్కడెక్కడ షాపులు ఏర్పాటు చేయాలో గుర్తించి నివేదిక అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం జిల్లాలో 54 గ్రామాల్లో కొత్తగా రేషన్ షాపులు ఏర్పాటు చేయవచ్చని నివేదిక పంపింది. డివిజన్ల వారీగా ఆర్డీఓలకు నోటిపికేషన్ ద్వారా రేషన్ డీలర్ల ఎంపిక చేయాలి. కానీ ఇప్పటి వరకు ఆర్డీఓలకు ఆదేశాలు రాకపోవడంతో ఆ ప్రక్రియ మొదలు కాలేదు.
కొత్త పంచాయతీలు ఏర్పడినా తీరని కష్టాలు
కొత్త గ్రామ పంచాయతీలు ఆవిర్భవించినప్పటికీ ఆయా చోట్ల కొత్త రేషన్ షాపులు ఏర్పాటు కాలేదు. దీంతో ఆయా గ్రామాలు, గూడేలు, తండాలకు చెందిన కార్డుదారులు పాత పంచాయతీలకే వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో నడక యాతన అనుభవిస్తున్నామని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పంచాయతీలు ఏర్పడినా కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు.
పాత డీలర్లతో బియ్యం ఇచ్చేలా చూడాలి
నిబంధనల ప్రకారం 500 కార్డులు పైచిలుకు ఉంటేనే కొత్త షాపు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో కొన్ని చోట్ల 100 కార్డులులేని పరిస్థితి. అలాంటప్పుడు 40 క్వింటాళ్ల బియ్యమే ఆ గ్రామానికి ఎలాట్ అయితే క్వింటాకు డీలర్కు వచ్చేది రూ.140. అంటే డీలర్కు రూ.4,500 ప్రభుత్వం నుంచి కమిషన్ వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త రేషన్ షాపులకు డీలర్లను ఏర్పాటు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం నాయకులు ఇప్పటికే ప్రభుత్వానికి, కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. కొత్త పంచాయతీల్లోనూ పాత పంచాయతీ డీలర్లతోనే బియ్యం ఇప్పించేలా చూడాలని కోరుతున్నారు.
ఫ కొత్తగా 54 షాపుల ఏర్పాటుకు
ప్రభుత్వానికి నివేదిక
ఫ నేటికీ మొదలుకాని డీలర్ల ఎంపిక ప్రక్రియ
ఫ బియ్యం కోసం పాత పంచాయతీలకే
వెళ్తున్న కార్డుదారులు


