
విద్యార్థులు ‘ఇన్స్పైర్’ పొందేలా..
నల్లగొండ: పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక ఆలోచనలు, సృజనాత్మకత వైపు మళ్లించి భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) మనక్ అవార్డు(2025–26)కు సంబంధించి.. పాఠశాలల్లోని విద్యార్థుల నుంచి ఆన్లైన్లో నామినేషన్లు ఆహ్వానిస్తోంది. ఈ నెల 15న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 15 వరకు కొనసాగనుంది. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీ, రెసిడెన్షియల్, ఎయిడెడ్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఇన్స్పైర్ మనక్ అవార్డుల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది.
ఆన్లైన్లో దరఖాస్తు చేసేదిలా..
ఇన్స్పైర్ మనక్పై ఆసక్తి కలిగిన పాఠశాల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని విద్యా శాఖ కోరుతోంది. www.inspireawards.gov.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాఠశాలలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళుతుంది. జిల్లా అథారిటీ ఆమోదిస్తే 24 గంటల్లోపు విద్యార్థికి సంబంధించిన మెయిల్ ఐడీకీ యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. అప్పుడు యూజర్ ఐడీకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. విద్యార్థి తన సమాచారం, బ్యాంకు అకౌంట్, ఐఎప్ఎస్సీ కోడ్, ఆధార్, విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టు సంక్షిప్త రిపోర్టు వెబ్సైట్లో నమోదు చేయాలి. విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం ఉంది. అయితే విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి ఆన్లైన్లో ప్రాజెక్టు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఐడియా బాక్సు ఏర్పాటు చేసుకోవాలి
అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు వినూత్న ఆలోచనలను ఉపాధ్యాయులు గుర్తించేందుకు ఐడియా బాక్సు ఏర్పాటు చేసుకోవాలి. పరిసరాల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ వేదిక ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రతి పాఠశాల నుంచి కచ్చితంగా 5 ప్రాజెక్టులు నామినేషన్ చేసుకోవాలి.
– వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి
ఇన్స్పైర్ మనక్ ఒక వరం
ఇన్స్పైర్ మనక్ విద్యార్థులకు ఒక వరం లాంటిది. శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుకునే విద్యార్థులకు ఎంతగానో దోహదం పడుతుంది. సామాజిక సమస్యలకు శాసీ్త్రయ రూపంలో పరిష్కారాలు చూపగలిగే సృజనాత్మక ప్రాజెక్టులను నమోదు చేయాలి. అందుకు సైన్స్ ఉపాధ్యాయులు సహకరించాలి.
– భిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారి
ఫ ఇన్స్పైర్ మనక్ అవార్డులకు మొదలైన దరఖాస్తులు
ఫ చిన్నారులను భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు కార్యక్రమం
ఫ 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అవకాశం
ఫ సెప్టెంబర్ 15 వరకు గడువు
గతంలో ఎంపికై నవి
సంవత్సరం ప్రాజెక్టులు
2022–23 143
2023–24 139
2024–25 131
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీలు
విద్యార్థులకు తమకు వచ్చిన ఆలోచనలతో తయారు చేసిన ప్రాజెక్టులు ప్రదర్శించేందుకు ఎంపికై తే వారి అకౌంట్లలో రూ.10 వేలు జమచేస్తారు. అయితే వాటిని జిల్లా స్థాయి పోటీల్లో ప్రదర్శిస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికై తే రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించిన ఆరు ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి జాతీయ స్థాయి పంపుతారు. జాతీయ స్థాయి ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రదర్శించడంతోపాటు రాష్ట్రపతి భవన్లో కూడా ప్రత్యేక ప్రదర్శిస్తారు. అనంతరం సకురా ప్రోగ్రామ్ ద్వారా జపాన్ దేశంలోని పరిశోధన కేంద్రాలను సందర్శించేందుకు ఎంపికై న విద్యార్థులను పంపుతారు.