
నేడు పౌరస్పందన వేదిక ప్రచార జాతా
నల్లగొండ : నల్లగొండలో సోమవారం పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రచార జాతా ప్రారంభం కానున్నట్లు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆదిఆవరం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ బడులను ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిస్తూ ఈ ప్రచార జాతా పట్టణంలోని గడియారం సెంటర్ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ జాతాకు టీఎస్యూటీఎఫ్ జిల్లా, మండల బాధ్యులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
బుద్ధవనం మహాద్భుతం
నాగార్జునసాగర్ : సాగర్లో నిర్మాణమైన బుద్ధవనం మహాద్భుతంగా ఉందని జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి సముద్రాల సంపూర్ణ ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన నాగార్జునసాగర్ను కుటుంబ సమేతంగా సందర్శించారు. సాగర్ పర్యటనలో భాగంగా బుద్ధవనం చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు బుద్ధవనం ఈఓ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర స్వాగతం పలికారు. మహాస్థూపం ధ్యాన మందిరంలో న్యాయమూర్తి దంపతుల చేత జ్యోతి ప్రజ్వలన చేయించారు. బుద్ధచరితవనం, ధ్యానవనం, స్థూపపార్కు తదితర ప్రాంతాలను సందర్శించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచీలో నాగార్జునకొండకు వెళ్లారు. అక్కడ మ్యూజియాన్ని సందర్శించారు. ఆయన వెంట గైడ్ సత్యనారాయణ, ఎస్ఐ సంపత్, ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, కోర్టు, పోలీస్ సిబ్బంది నరేష్, శివ, కిషన్ ఉన్నారు.
కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నల్లగొండ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఇంటర్ ఫస్టియర్ మ్యాథ్స్, జువాలజి, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షకు 4398 మంది విద్యార్థులకు గాను 4105 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షకు 1,670 మంది హాజరు కావాల్సి ఉండగా 1,590 మంది పరీక్ష రాశారు.
ఉత్తమ సాధన రాష్ట్ర కమిటీకి చందంపల్లి టీచర్
నకిరేకల్ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అభివృద్ధి, బోధనాంశాల్లో మంచి అనుభవాలను గుర్తించేందుకు విద్యాశాఖ తీసుకున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ స్కూల్స్ (ఉత్తమ సాధన) రాష్ట్ర స్థాయి కమిటీకి నకిరేకల్ మండలం చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం కనుకుంట్ల నవీన్రెడ్డి ఎంపికయ్యారు. కలెక్టర్ చైర్పర్సన్గా జిల్లా వ్యాప్తంగా 39 మంది ఉపాధ్యాయుల పేర్లను పరిశీలించి వీరిలో ముగ్గురిని ఎంపిక చేశారు. నవీన్రెడ్డి చందంపల్లి పాఠశాల బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి ఎంపిక చేశారని ఎంఈఓ మేకల నాగయ్య తెలిపారు. నవీన్రెడ్డిని డీఈఓ భిక్షపతి, సెక్టోరియల్ ఆఫీసర్ రామచంద్రయ్య అభినందించారు.
కళాశాలల మూసివేత నిర్ణయం సరికాదు
సూర్యాపేట : రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల మూసివేత నిర్ణయం సరికాదని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసేన్, రాష్ట్ర కార్యదర్శి దాసరి దేవయ్య, జిల్లా అధ్యక్షులు బోయిళ్ల అఖిల్, అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.