
జూన్లోనే మూడు నెలల రేషన్
జూన్, జూలై, ఆగస్టు మాసాల కోటా బియ్యం పంపిణీ
నల్లగొండ : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే వర్షాకాలంలో వర్షాలు, వరదలకు బియ్యం రవాణా, సరఫరాలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండడంతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను జూన్ మాసంలోనే పేదలకు పంపిణీ చేయనుంది. అందులో భాగంగా అధికారులు రేషన్ షాపులకు బియ్యం రవాణాను ప్రారంభించారు.
నెలకు 9 వేల మెట్రిక్ టన్నులు..
జిల్లాలో మొత్తం 4,84,216 మంది రేషన్కార్డుదారులు ఉండగా అందులో 15,02,656 మంది సభ్యులు ఉన్నారు. వారందరికి నెలకు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుంది. మూడు నెలలక సంబంధించి 27 వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది. ఈ బియ్యం ఈ నెల 30లోగా రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. అయితే రేషన్ షాపుల్లో కొన్నిచోట్ల మూడు బియ్యం నిల్వ చేయడానికి స్థలం లేనందున విడతల వారీగా సరఫరాను చేయాలని నిర్ణయించారు. మొదట ఒక లారీ, వారం రోజుల తర్వాత మరో లారీ, మరో వారం తర్వాత లారీ.. ఇలా మూడు విడతలుగా షాపులకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం రవాణా అవుతాయి.
జూన్ 1 నుంచి 30 వరకు పంపిణీ
ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యాన్ని మూడు మాసాలకు సంబంధించిన కోటాను జూన్ మాసంలో పంపిణీ చేయనున్నారు. రేషన్ డీలర్లు జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు అందాయి. ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఫ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆదేశం
ఫ ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్షాపులకు బియ్యం సరఫరా
బియ్యం రవాణా ప్రారంభించాం
రేషన్ కార్డుదారులకు ఒకేసారి మూడు మాసాలకు సంబంధించిన బియ్యం కోటాను అందించాలని ఆదేశాలు వచ్చాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు రవాణా ప్రారంభించాం. జూన్ 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. ఏ ఒక్క కార్డుదారుడు ఇబ్బంది పడకుండా డీలర్లు బియ్యం పంపిణీ చేస్తారు. రవాణాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. – హరీష్, డీఎం
పౌర సరఫరాల శాఖ, నల్లగొండ

జూన్లోనే మూడు నెలల రేషన్