
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడలో రాజకీయం వేడెక్కుతోంది. నియోజకవర్గంలో సీపీఎం పోటీ చేసి తీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించిన మరుసటి రోజే సభ నిర్వహణపై కేసు నమోదు కావడం గమనార్హం. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య ఆదివారం మిర్యాలగూడకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన సీపీఎం శ్రేణులు.. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద సాగర్రోడ్డుపై భారీగా స్టేజీ ఏర్పాటు చేసి బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం మాట్లాడారు. కాగా సీపీఎం నాయకుడు డబ్బికార్ మల్లేష్ కేవలం మైక్ మాత్రమే ఏర్పాటు చేసుకుంటామని పోలీసుల నుంచి అనుమతి తీసుకుని సాగర్రోడ్డు ఒక వైపును బ్లాక్ చేసి బహిరంగ సభను ఏర్పాటు చేశారని, దీంతో ఆ రోడ్డు గుండా వెళ్లే వాహనాలను కూడా మళ్లించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని.. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఏఎస్ఐ చంద్రయ్య రాత పూర్వకంగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సైదిరెడ్డి సీపీఎం రాష్ట్ర నాయకుడు డబ్బికార్ మల్లేష్పై 188, 314 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.