టీచర్లకు టెట్ గుబులు
● కొలువు నిలవాలంటే ఉత్తీర్ణత తప్పనిసరి
● అటు ఎలక్షన్ డ్యూటీలు, ఇటు పాఠశాల విధులు
● సమయం దొరక్క పాఠశాలలకు సెలవు పెడుతున్న ఉపాధ్యాయులు
ప్రిపేర్ అవుతున్నా..
ఒకవైపు వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే వీలు దొరికినప్పుడల్లా టెట్ ప్రిపేర్ అవుతున్నా. ఇంట్లో పుస్తకాలు చదువుతున్న. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 2008 డీఎస్సీ ద్వారా బీఎడ్, ఎంఏ అర్హతతో ఎస్ఏ ఆంగ్లం ఉపాధ్యాయుడిగా నియామకమయ్యాను. తర్వాత వృత్తి పరమైన ప్రమోషన్ కోసం డిపార్టుమెంటల్ పరీక్ష ఉత్తీర్ణత సాధించా. – కృష్ణయ్య, ఎస్ఏ ఆంగ్లం,
జెడ్పీహెచ్ఎస్, కోడేరు
పరీక్ష సులువే..
రోజువారీ తరగతి గదిలో బోధన చేస్తున్న తమకు పరీక్ష రాయడం సులువే. కానీ, తెలంగాణ ప్రభుత్వం నియమించిన అన్ని పరీక్షలు రాసి వచ్చి 16 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న మమ్మల్ని టెట్ పేరుతో ఆందోళనకు గురుచేయడం సరికాదు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో కొంత సమయం వృథా అయింది. ఎంతో అనుభవం గడించిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలో అర్హత సాధించాలనే నిబంధన పెట్టడం సరికాదు. – వేణుగోపాల్,
ఎస్జీటీ, బావాజీతండా, ఊర్కొండ మండలం
కందనూలు: ప్రభుత్వ ఉపాధ్యాయుల మెడపై ఇప్పుడు టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) కత్తి వేలాడుతోంది. టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టీచర్లకు నిద్రను దూరం చేసింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు సైతం రెండేళ్లలోపు టెట్ అర్హత సాధించాలని నిబంధన పెట్టడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రత కోసం ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు టెట్ తప్పనిసరి చేస్తూ 2010లో ఉత్తర్వులు వచ్చాయి. ఆ తర్వాత మూడుసార్లు (2012, 2017, 2024)లో నిర్వహించిన నియామకాలలో టెట్ పాసైన వారు మాత్రమే టీచర్లుగా భర్తీ అయ్యారు.
జిల్లాలో 2,266 మంది..
2010 కంటే ముందు టీచర్లుగా నియామకమైన వారికి టెట్ తప్పనిసరి కావడంతో అలాంటివారు జిల్లాలో 2,266 మంది ఉన్నారు. ఇందులో కొందరు ఉపాధ్యాయులు ఇప్పటికే టెట్ ఉత్తీర్ణత సాధించగా.. మిగుతా వారు టెట్ అర్హత సాధించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం టీచర్లకు విధులు కేటాయించడంతో కొంత సమయం వృథా అయిపోయింది.
ఖాళీ సమయాల్లో సాధన పోరాటం..
తరగతి గది విధుల మధ్య ఖాళీ సమయాల్లో టెట్ కోసం ఆన్లైన్ తరగతులు వింటున్నారు. కొందరు సాయంత్రం వేళలో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సెలవు రోజుల్లో ఇంట్లో టెట్కు సిద్ధమవుతున్నారు.
సిలబస్లో కనిపించని సమతుల్యత
టెట్ పరీక్ష సిలబస్, ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే ఇది ప్రస్తుత తరం అభ్యర్థులకు సైతం సవాల్గా మారింది. జనరల్ కేటగిరీ విద్యార్థులు 60 శాతం (90 మార్కులు), బీసీలు 50 శాతం (75), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం (60) సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ (జీవశాస్త్రం) ఉపాధ్యాయలు తమ సబ్జెక్టు కాని గణితంలో 30 మార్కులకు పరీక్ష రా యాల్సి వస్తోంది. సైన్స్ కంటెంట్ విభాగంలో కేవ లం కేవలం 24 మార్కులే ఉండగా, అందులోనూ జీవశాస్త్రంతోపాటు భౌతిక, రసాయన శాస్త్రాలు ఉన్నాయి. సాంఘిక శాస్త్రం పేపరు రాసేవారు భాష శాస్త్రం 30 మార్కులు, ఆంగ్లం 30 మార్కులకు పరీక్ష రాయాలి. ఈ సిలబస్ విధానంతో అత్యధిక మంది అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత సాధించలేకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
టీచర్లకు టెట్ గుబులు
టీచర్లకు టెట్ గుబులు


