తగ్గనున్న దూరభారం
నాగర్కర్నూల్ క్రైం: స్థానిక ఎస్పీ కార్యాలయం సమీపంలో జిల్లా రవాణా శాఖ నూతన కార్యాలయం నిర్మించేందుకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యాలయం జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో మల్కాపూర్ సమీపంలో ఉండడంతో వినియోగదారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ప్లాట్లకు ధరలు పెంచుకునేందుకు తమ వెంచర్ పక్కనే డీటీఓ భవనం నిర్మించి ఇచ్చారు. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు రియల్ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలుకుతూ జిల్లా ప్రజలకు రవాణాశాఖ సేవలను దూరం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కార్యాలయంలో సమస్యలు ఉన్నాయని గుర్తించిన ఎమ్మెల్యే రాజేష్రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఎస్పీ కార్యాలయానికి సమీపంలో 2ఎకరాల భూమిని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి కేటాయించేందుకు కృషి చేశారు.
ఇటీవలే భూమిపూజ
జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి కేటాయించిన ప్రభుత్వ భూమి పత్రాలను తహసీల్దార్ సమక్షంలో డీటీఓ చిన్న బాలుకు అందజేశారు. అనంతరం నూతన భవన నిర్మాణం కోసం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి భూమిపూజ చేశారు. నాగర్కర్నూల్ జిల్లాగా మారినప్పటి నుంచి ఉయ్యలవాడ సమీపంలో అద్దె భవనంలో రవాణాశాఖ కార్యాలయానికి సంబంధించిన సేవలు కొనసాగాయి. రెండేళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వలాభం కోసం వారు నిర్మించి ఇచ్చిన భవనంలోకి రవాణాశాఖ కార్యాలయాన్ని మార్చి సేవలు అందిస్తున్నారు. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల నుంచి ప్రతిరోజు జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి వంద మంది వరకు వివిధ సేవలు పొందేందుకు వస్తున్నారు.
ఎస్పీ కార్యాలయం పక్కనే జిల్లా రవాణా శాఖ నూతన భవన నిర్మాణానికి ఏర్పాట్లు
ప్రస్తుతం జిల్లా కేంద్రానికి 10 కి.మీ. దూరంలో..
అధునాతన వసతుల ఏర్పాటుకు చర్యలు
ఇటీవలే ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ
ఉగాది వరకు ప్రారంభించేందుకు కసరత్తు
జిల్లా రవాణాశాఖ సేవలను ప్రజలకు అందించేందుకు నిర్మిస్తున్న జిల్లా రవాణాశాఖ కార్యాలయాన్ని ఉగాదిలోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే రాజేష్రెడ్డి ఆదేశాలతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. నూతన భవనంతో పాటు వాహనదారులకు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ట్రాక్ను, ఇతర గదుల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
సేవలు మరింత దగ్గరవుతాయి
జిల్లా రవాణాశాఖ కార్యాలయాన్ని జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల రవాణాశాఖ సేవలు వినియోగించుకునేందుకు ఎంతో సులభంగా ఉంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్న రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాలంటే పది కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ సరైన సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో మళ్లీ ఏదైనా అవసరం పడితే జిల్లా కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఉంది.
– గోవర్ధన్, నాగర్కర్నూల్
ఉగాదిలోగా..
జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లా రవా ణాశాఖ కార్యాలయానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. నూతన భవనం ఉగాదిలోగా పూర్తి చేసి అందుబాటు లో తీసుకొస్తాం. రవాణాశాఖ సేవలు పొందేందుకు ప్రజలకు మరింత సులువవుతుంది.
– చిన్నబాలు, డీటీఓ, నాగర్కర్నూల్
తగ్గనున్న దూరభారం
తగ్గనున్న దూరభారం


