నేటినుంచి మూడో విడత
సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అచ్చంపేట, లింగాల, బల్మూరు, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల పరిధిలోని 158 గ్రామ పంచాయతీలు, 1,364 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లస్టర్ కేంద్రాల వద్ద అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 6న శనివారం సాయంత్రం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. అప్పీళ్లు చేసుకునేందుకు 7 వరకు అవకాశం ఉండగా.. 8 వరకు అప్పీళ్లను పరిష్కరిస్తారు. 9న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు. 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతాయి.
11 క్లస్టర్ల ఏర్పాటు
సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆయా మండలాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేశారు. అచ్చంపేట మండలంలో మొత్తం 38 గ్రామ పంచాయతీలు ఉండగా.. 11 క్లస్టర్లు ఉన్నాయి. చెన్నారం క్లస్టర్ పరిధిలో చెన్నారం, సింగారం, పెద్దతండా, కన్యాతండా, ఎద్దుమిట్టతండా, హాజీపూర్ క్లస్టర్లో హాజీపూర్, బుడ్డతండా, చందాపూర్, అంకిరోనిపల్లి, బ్రాహ్మణపల్లి, పలకపల్లి క్లస్టర్లో పలకపల్లి, లింగోటం, లక్ష్మాపూర్ క్లస్టర్లో లక్ష్మాపూర్, గుంపన్పల్లి, చౌటపల్లి, చెంచుపల్గుతండా, నడింపల్లి క్లస్టర్లో నడింపల్లి, పులిజాల, రంగాపూర్ క్లస్టర్లో రంగాపూర్, బోల్గట్పల్లి, దర్శన్గడ్డ, ఐనోలు క్లస్టర్లో ఐనోలు, శివారుతండా, దుబ్బతండా, కొర్రతండా, చేదురుబావితండా, బొమ్మనపల్లి క్లస్టర్లో బొమ్మనపల్లి, కిష్ట్యాతండా, సిద్దాపూర్ క్లస్టర్లో సిద్దాపూర్, పద్మారంతండా, మన్నెవారిపల్లి క్టస్టర్లో మన్నెవారిపల్లి, జోగ్యతండా, దేవులతండా, మర్లపాడుతండా, ఘనపూర్ క్లస్టర్లో ఘనపూర్, ఆంజనేయులుతండా, అక్కారం, బక్కలింగాయిపల్లి ఉన్నాయి.
ఆ గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులేరి?
అమ్రాబాద్ మండలంలోని 5 గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల ప్రకారం ఎన్నుకునేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులు కరువయ్యారు. అనుకూలమైన రిజర్వేషన్ లేకున్నా.. ఉప సర్పంచ్గానైనా బాధ్యతలు స్వీకరిద్దామంటే వార్డుసభ్యుల మెజార్టీ సైతం దక్కడం లేదు.
ఈ మండలంలో మొతం 20 పంచాయతీలు ఉండగా.. తుర్కపల్లి మినహా మిగిలిన 19 జీపీలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఇందులో కుమ్మరోనిపల్లి, ప్రశాంత్నగర్, కల్మూలోనిపల్లి, లక్ష్మాపూర్(బీకే), వంగురోనిపల్లి గత కొన్నేళ్లుగా సర్పంచ్, ఉపసర్పంచ్లకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇక్కడ ఎన్నికలే నిర్వహించడం లేదు. ఏజెన్సీ ఏరియా కావడంతో సర్పంచ్ స్థానాలతో పాటు 8 వార్డులకు గాను అందులో నాలుగు వార్డులు సైతం ఎస్టీలకే రిజర్వేషన్ కేటాయించగా.. ఇక్కడ ఆ వర్గానికి చెందిన వారు లేరు. ఫలితంగా ఇప్పటి మూడు పర్యాయాలు ఈ గ్రామాలు సర్పంచ్ పదవికి దూరంగా ఉన్నాయి.
తొలి విడత ఉపసంహరణకు నేడే ఆఖరు..
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడతలో దాఖలైన నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. బుధవారమే తుది గడువు కావడంతో పలువురు అభ్యర్థుల నామినేషన్ల విత్డ్రా కోసం బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఓట్ల చీలికతో పార్టీకి నష్టం జరుగుతుందని నచ్చజెప్పుతున్నారు. బీఆర్ఎస్లోనూ ఒకరికన్నా ఎక్కువ మంది నామినేషన్లు వేసిన చోట విత్డ్రా కోసం పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. తొలివిడత ఎన్నికల కోసం ఇప్పటికే నామినేషన్లు వేసిన వారిలో ఎవరు తప్పుకుంటారో.. ఎందరు బరిలో ఉంటారో సాయంత్రం వరకు తేలనుంది.
11 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
7 మండలాల పరిధిలో 158 జీపీలు, 1,364 వార్డు స్థానాలకు ఎన్నికలు
నేటినుంచి మూడో విడత
నేటినుంచి మూడో విడత


