బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించాలి
నాగర్కర్నూల్: ఆదివాసీల ఆరాధ్యదైవం, మహానాయకుడు బిర్సా ముండా జయంతిని నవంబర్ 15న ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. భారత గిరిజన సమాజానికి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తినిచ్చిన బిర్సా ముండా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని కొనియాడారు. ముండా తెగకు చెందిన ఆయన, గిరిజన హక్కుల కోసం చేసిన పోరాటంతో భారత చరిత్రలో అపూర్వ స్థానాన్ని సంపాదించారన్నారు. భారత గిరిజన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నవంబర్ 15 శనివారం నాగర్కర్నూల్ కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో నిర్వహించే జయంతి కార్యక్రమానికి గిరిజనులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కలెక్టర్ శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
భూ నిర్వాసితులకు
పునరావాసం కల్పించాలి
వెల్దండ: డిండి–నార్లాపూర్ ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న ఎర్రవల్లి గ్రామస్తులు భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వెల్దండ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లి రెవెన్యూ శివారులోని భూ నిర్వాసితుల పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకెజీ కింద ప్రజలకు నివాసం కల్పించే విధంగా భూసర్వే చేసి స్థలం ఎంపిక చేయాలని సూచించారు. గతంలో భూములు కోల్పోయిన బాధితులందరికీ నష్టపరిహరం అందించాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి, సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ భారతిలో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, ఇప్పటి వరకు ఎన్నింటిని పరిష్కరించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన జీపీఓలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్తీక్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐ శంకర్, జీపీఓలు తదితరులు ఉన్నారు.
‘యూనిటీ మార్చ్’ను
జయప్రదం చేయండి
నాగర్కర్నూల్ క్రైం: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే యూనిటీ మార్చ్ను జయప్రదం చేయాలని మేర యువ భారత్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా యూత్ అధికారి కోటా నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ మార్చ్ను నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుజరాత్ రాజ్యసభ సభ్యుడు డా.పార్మా జశ్వంత్సింగ్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్రఘునాథ్ హాజరవుతారని తెలిపారు. యూనిటీ మార్చ్ ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి ప్రారంభమై కొల్లాపూర్ క్రాస్ రోడ్డు వరకు కొనసాగుతుందని, విద్యార్దులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సమావేశంలో యూనిటీ మార్చ్ కన్వీనర్ నాగేంద్రంగౌడ్, కో కన్వీనర్ నర్సింహ, విజయేందర్ ఉన్నారు.
ఉత్సాహంగా
అస్మిత లీగ్ అథ్లెటిక్స్
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా మైదానంలో శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) సంయుక్తంగా అస్మిత లీగ్ అథ్లెటిక్స్ జిల్లా మీట్ 2025–26 నిర్వహించినట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం చైర్మన్ వాకిటి శ్రీధర్, కార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్ తెలిపారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, కాంగ్రెస్ నాయకుడు లక్కాకుల సతీష్ హాజరయ్యారని చెప్పారు. సాయంత్రం ముగింపు సమావేశానికి లక్కాకుల సతీష్ పాల్గొని విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసినట్లు వివరించారు.
బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించాలి


