
11న మెగా జాబ్ మేళా
కందనూలు: కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఎం డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న హెచ్సీఎల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ ఆధికారి వెంకటరమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ పూర్తిచేసి.. 75శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల జిరాక్స్తో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 83176 38406, 79818 34205 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
కల్వకుర్తి టౌన్: విధి నిర్వహణలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని డీసీహెచ్ఎస్ రామకృష్ణ అన్నారు. మంగళవారం కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పలు రికార్డులతో పాటు వార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యులు, సిబ్బందితో డీసీహెచ్ఎస్ సమావేశమై మాట్లాడారు. సీహెచ్సీ సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు.
కార్మిక వ్యతిరేక జీఓను రద్దు చేయాలి
కల్వకుర్తిరూరల్: రాష్ట్ర కార్మికశాఖ విడుదల చేసిన జీఓ 282ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. కార్మికుల పనివేళలను 10 గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జీఓ ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కార్మికులపై అదనపు భారం మోపే విధంగా జారీ చేసిన జీఓను రద్దు చేయాలని.. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు బాలయ్య, బాల్రెడ్డి, శ్రీనివాసులు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి టోర్నీలో
చాంపియన్గా నిలవాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్గా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో బుధవారం నుంచి నెల 12తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు మంగళవారం తరలివెళ్లింది. ఈసందర్భంగా జిల్లా జట్టును స్థానిక మెయిన్ స్టేడియంలో ఆయన అభినందించారు. ఫుట్బాల్లో జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టీస్తో క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శంకర్ లింగం, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, సభ్యులు నందకిషోర్, కోచ్ వెంకట్రాములు, ప్రకాశ్, లక్ష్మణ్, భార్గవి, పూజ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా బాలికల జూనియర్ ఫుట్బాల్ జట్టు: ముడావత్ నిఖిత, ఎంవీ దయాంజలి, పి.ఆనంద వర్షిణి, వినుతశ్రీ, తిరుమల రుత్విక, డి.సునీత, పాత్లవత్ ఆర్తి, ఎ.వర్ష, ఎల్.అనూష, సి.మణిదీపిక, కె.నిహారిక, ఆర్.సావిత్రి, ఎం.కీర్తి, ఆర్.పూజ, స్వాతి, కె.నిత్య, శాన్విత, నర్వ రిశితారాజ్.

11న మెగా జాబ్ మేళా