
పక్కాగా వంద రోజుల కార్యాచరణ అమలు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీల్లో వంద రోజుల కార్యాచరణ పక్కాగా అమలుపర్చాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ నారాయణరావు అధికారులకు సూచించారు. గురువారం పట్టణంలో వంద రోజుల కార్యాచరణ అమలు తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. ముందుగా మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియపై మున్సిపల్ సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం డీఆర్ఏసీసీ సెంటర్లో చెత్త రీసైక్లింగ్ ప్రక్రియను పరిశీలించారు. పట్టణంలో ఎనిమల్ బర్త్ సెంటర్ (ఏబీసీ) పనులు పూర్తయినందున.. వెంటనే ప్రారంభించాలని కమిషనర్ మహమూద్ షేక్కు సూచించారు. అదే విధంగా ప్రధాన మురుగు కాల్వను పరిశీలించారు. వానాకాలంలో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని తెలిపారు. పట్టణంలో తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని వార్డు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీలో వందశాతం పన్నుల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ ఏఈ షబ్బీర్, మేనేజర్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.