
సమస్యలు తీర్చండి..
ప్రభుత్వ టీచర్లు సమయపాలన పాటించేలా చూడాలి
ప్రశ్న: జిల్లాలో విద్యాహక్కు చట్టం ఎక్కడా అమలుకావడం లేదు. పకడ్బందీగా అమలయ్యేలా చూడండి.
– ప్రసాద్, కల్వకుర్తి
డీఈఓ: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి విద్యార్థి చదువుకునేలా నిర్బంధ ఉచిత విద్యను పకడ్బందీగా అమలుచేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలల్లోనూ బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా, ఫీజు రాయితీతో విద్య అందించేలా చూస్తాం. దీనిపై ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
● జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని
పకడ్బందీగా అమలు చేయాలి ●
● ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులన నియంత్రించండి
● ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఈఓ రమేశ్కుమార్కు
వినతులు
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్కుమార్ అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక స్థాయిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంబంధిత అభ్యసన కార్యక్రమాలను అందిస్తున్నామని చెప్పారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యారంగ సమస్యలపై ‘సాక్షి’ చేపట్టిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని.. జిల్లావ్యాప్తంగా విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని పలువురు డీఈఓకు ఫోన్చేసి విజ్ఙప్తి చేశారు.
ప్రశ్న: ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు టీచర్లు సమయపాలన పాటించడం లేదు. ప్రార్థనా సమయానికి ప్రతి ఉపాధ్యాయుడు హజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.
– విజయ్కుమార్, నాగర్కర్నూల్
డీఈఓ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటించేలా చూస్తాం. సక్రమంగా విధులు నిర్వర్తించని వారిపై చర్యలు తప్పవు. ఉపాధ్యాయుల హాజరు, పనితీరు, సమయపాలనపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపడతాం.
ప్రశ్న: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు లేవు. కనీసం టాయిలెట్లు కూడా సరిగా ఉండటం లేదు.
– అనిల్కుమార్, అచ్చంపేట
డీఈఓ: అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా టాయిలెట్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఎక్కడైనా లేకపోతే ప్రతిపాదనలు సిద్ధంచేసి వెంటనే నిర్మించేలా చర్యలు తీసుకుంటాం. టాయిలెట్లతో పాటు తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటుచేస్తున్నాం.
ప్రశ్న: విద్యార్థులు లేరన్న కారణంతో ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నారు. మూసేసిన బడులను తిరిగి తెరిపించాలి.
– మహేంద్ర, పెద్దాపూర్, అచ్చంపేట
డీఈఓ: జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లను గుర్తించి.. వాటికి సైతం ఉపాధ్యాయులను కేటాయిస్తున్నాం. విద్యార్థుల సంఖ్య పెంచి బడులను నడిపించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించి విద్యార్థుల హాజరు పెరిగేలా చూస్తాం.
ప్రశ్న: ప్రైవేటు పాఠశాలల్లో ఎల్కేజీకే రూ. 20వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ, గ్రౌండ్, కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదు. – ప్రవీణ్, నాగర్కర్నూల్
డీఈఓ: ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీల ఆధ్వర్యంలో ఫీజులపై తీర్మానం జరగాలి. అన్ని పాఠశాలలు పేరెంట్స్ కమిటీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేస్తాం. నిబంధనలు పాటించని పాఠశాలలపై మాకు ఫిర్యాదు అందితే తప్పకుండా స్పందించి చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు, పారిశుధ్య సమస్య ఉంది. పరిష్కారానికి చర్యలు తీసుకోగలరు.
– తిరుపతయ్య, పోతిరెడ్డిపల్లి, తిమ్మాజిపేట
డీఈఓ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్లీపర్లను నియమించాం. ఈసారి కూడా వారి ద్వారానే పారిశుద్ధ్య నిర్వహణ ఉంటుంది. మిషన్ భగీరథ పథకంతో పాఠశాలల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై విద్యార్థులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తారు?
– తిరుపతి, గంగారం, బిజినేపల్లి
డీఈఓ: గతేడాది జిల్లాలో 27 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై విద్యా బోధన ప్రారంభించాం. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయనున్నాం. ఇందుకోసం ప్రత్యేక సిలబస్ను ప్రభుత్వం నిర్దేశించింది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏఐ విద్యా బోధన కొనసాగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి పాఠశాలలో కంప్యూటర్లు ఏర్పాటు చేస్తుంది. అలాగే ఖాన్ ఫౌండేషన్ ద్వారా జిల్లాలోని ప్రతి ప్రభుత్వ బడిలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కొనసాగుతాయి. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తారు.

సమస్యలు తీర్చండి..