
‘భూ భారతి’ దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తాం
వంగూరు/మన్ననూర్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై సమర్పించిన ప్రతి దరఖాస్తును పరిష్కరిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొని భూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలపై ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ సమస్యలపై అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. భూ భారతి చట్టంతో పరిష్కార మార్గం చూపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
● అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన రైతు పర్వతాలుకు ఉపాధిహామీ పథకంలో మంజూరైన పౌల్ట్రీ యూనిట్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తిగా షెడ్ నిర్మాణాన్ని నెలరోజుల్లో పూర్తిచేసి.. కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాలని లబ్ధిదారుకు సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మండలానికి ఒకటి చొప్పున మంజూరు చేస్తున్న షెడ్లో వెయ్యి కోడి పిల్లలను పెంచే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు, గ్రామీణ యువతను స్వయం ఉపాధిలో ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ చిన్న ఓబులేషు, ఏపీడీ శ్రీనివాసులు, ఎంపీడీఓ లింగయ్య, ఏపీఓ రఘు, పంచాయతీ కార్యదర్శి భీముడు పాల్గొన్నారు.