
సాగు సంబురం
● జిల్లావ్యాప్తంగా
మోస్తరు నుంచి భారీ వర్షాలు
● దుక్కులు దున్ని..
విత్తనాలు విత్తుతున్న రైతులు
అచ్చంపేట: జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రైతులు అరకలు, ట్రాక్టర్లతో పొలాలకు వెళ్లి దుక్కులు దున్నుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్నిన రైతులు జొన్న, పత్తి, సజ్జలు, ఆముదం తదితర విత్తనాలు విత్తుతున్నారు. సాగుకు అనుకూలంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా, ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ ప్రకటించడంతో రైతుల్లో కొంత ఆందోళన నెలకొన్నా.. గతేడాదిలాగే వర్షాలు అధికంగా కురుస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు అనుకూలంగా ఉండటంతో మొలకలు ఇబ్బంది లేకుండా వస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.
సాగు పనుల్లో బిజీబిజీ..
జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనుల్లో రైతులు బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలో కురిసిన తొలకరి చినుకులకు రైతులు తమ పంట పొలాల్లో జొన్న, పత్తి, సజ్జలు, ఆముదం, కందిపంట సాగుకు శ్రీకా రం చుట్టారు. దుక్కులు దున్నడం.. విత్తనాలు విత్తడం వంటి పనులు జోరందుకున్నాయి. అయితే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఘణనీయంగా పెరగడం రైతులకు భారంగా మా రింది. విత్తనాల కొనుగోలు నుంచి మొదలు.. పంట చేతికొచ్చే వరకు పెట్టుబడులు పెట్టినా ఆశించిన స్థాయిలో దిగుబడి, ధరలు వస్తాయో లేదోనని రైతు లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సకాలంలో రైతుభరోసా ఇచ్చినా పెట్టుబడికి కొంత సా యం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
5,38,462 ఎకరాల్లో పంటసాగు..
జిల్లాలో గతేడాది వానాకాలం 4,35,692 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేయగా.. ఈఏడాది 5,38,462 ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇందులో 1,60,021 ఎకరాల్లో వరి, 2,86,471 ఎకరాల్లో పత్తి, 7,822 ఎకరాల్లో జొన్న, 72,929 ఎకరాల్లో మొక్క జొన్న, 8,909 ఎకరాల్లో కందులు, 368 ఎకరాల్లో మినుములు, 895 ఎకరాల్లో వేరుశనగ, 239 ఎకరాల్లో ఆముదం, 809 ఎకరాల్లో ఇతర పంటలు, మరో 52,603 ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వీరంరాజుపల్లిలో పత్తి విత్తనాలు నాటేందుకు
పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతులు
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
వర్షాల రాకతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులకు కావాల్సిన ఎరువులతో పాటు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వదే విత్తనాలు కొనుగోలు చేయాలి. దళారుల వద్ద నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు.
– చంద్రశేఖర్, డీఏఓ

సాగు సంబురం