
పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చర్యలు
నాగర్కర్నూల్ క్రైం: పిల్లలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవానికి ఆమె హాజరై మాట్లాడారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను బాధ్యతగా చదివించాలని సూచించారు. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన బాలబాలికలు ఆటపాటలకు దూరమై పని ప్రదేశాల్లో మగ్గిపోవడం సరికాదన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎవరైనా 14ఏళ్ల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడైనా బాలకార్మికులను గుర్తిస్తే డయల్ 1098కు సమాచారం అందించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్రావు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం లత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.