
‘సబ్సిడీ’కి మంగళం
అచ్చంపేట: వరి విత్తనాలపై ప్రభుత్వం సబ్సిడీ ఎత్తేయడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. అసలే మొగిపురుగు, ఇతర తెగుళ్లతో ఏటా రైతులు నష్టాలను చవిచూస్తుంటే విత్తనాలకు రాయితీ లేకపోవడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర రకాలకు గతంలో సబ్సిడీ వర్తించేది. కానీ, సబ్సిడీ ఎత్తేయడంతో రైతులు అదనంగా రూ.300 వెచ్చించాల్సి వస్తోంది. యాసంగి సీజన్ ముగియడం.. ఈ నెల 25న రోహిణి కార్తి ప్రారంభం కావడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. దీనికితోడు ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించాయి. జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా కాగా.. 1,60,021 ఎకరాల్లో వరి సాగులోకి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు.
30 కిలోల బస్తా..
జిల్లాలో 35,020 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. తెలంగాణ వరి రకం 30 కిలోల బస్తా ఇంతకు ముందు రూ.550 ధర ఉండగా ప్రస్తుతం రూ.వెయ్యికి పెరిగింది. తెలంగాణ రకాలకు కిలో రూ.10, ఆంధ్ర రకాలపై కిలోకు రూ.5 చొప్పున సబ్సిడీ ఉండేది. కానీ, ఈసారి ఆ అవకావం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. సన్నరకం (బీపీటీ) 25 కిలోల బస్తాకు గత యాసంగిలో రూ.900, దొడ్డు రకం రూ.వెయ్యి ఉండగా ఇప్పుడు మరింత పెరగనున్నాయి. జిల్లా రైతులు ఎక్కువగా సొసైటీలు, ఆగ్రోస్, డీసీఎంఎస్ల ద్వారా విత్తన బస్తాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో వాటికి డిమాండ్ పెరగనుంది.
జిల్లాలో ప్రతి మండలానికి సుమారు 200 క్వింటాళ్లు అవసరంగా ఉండగా 30 నుంచి 50 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు సరఫరా చేశారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా ధర గతేడాది రూ.1,100 ఉండగా ప్రస్తుతం రూ.2,130కు పెంచారు. వీటికి 50 శాతం సబ్సిడీతో సరఫరా చేస్తున్నారు. ధర రెండింతలు పెంచి 50 శాతం సబ్సిడీ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం జీలుగ విత్తనాల ధర పెంచి సబ్సిడీ ప్రకటించడం వల్ల రైతులపై భారం పడుతోంది.
వరి విత్తనాలపై రాయితీ ఎత్తేసిన ప్రభుత్వం
గతంలో 30 కిలోల బస్తాకు రూ.550.. ప్రస్తుతం రూ.వెయ్యి
జీలుగ విత్తనాలు సైతం
అమాంతం పెంపు
సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో వాటికే డిమాండ్
అన్నదాతలకు తప్పని అదనపు భారం
జీలుగ ధర పెంచి..
తెగుళ్లతో పరేషాన్..
మూడేళ్లుగా మొగి పురుగు విజృంభిస్తుండటంతో రైతులు ఖరీదైన రసాయన మందులు పిచికారీ చేసినా పంటను కాపాడుకోలేకపోతున్నారు. ఈ ప్రభావం ముందుస్తు వేసిన వరి నాట్లపై తీవ్రంగా ఉంటుంది. గత యాసంగిలో పంట చేతికి వచ్చ దశలో వేరుకుళ్లు వ్యాప్తి చెందడంతో ఎకరాకు 40 బస్తాల పైనే దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు 35 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వానాకాలం పంట సాగుకు రైతులు సిద్ధమవుతుండగా సబ్సిడీ విత్తనాల భారం కుంగదీస్తుంది.