
పొగాకు ఉత్పత్తులను వినియోగించొద్దు
నాగర్కర్నూల్ క్రైం: పొగాకు ఉత్పత్తుల వినియోగించి అనారోగ్యం బారినపడ కూడదని జిల్లా వైద్యాధికారి డా. స్వరాజ్యలక్ష్మి సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అందరితో పొగాకు ఉత్పత్తులు వినియోగించమని, స్నేహితులు, కుటుంబ సభ్యులు, పరిచయస్తులకు అవగాహన కలిగిస్తామని, పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులైన గుట్కా, ఖైనీ, తంబాకు, జర్దా తదితర ఉత్పత్తులను వినియోగించడంతో శరీరంలో రక్తనాళాలు, మెదడు, గుండె, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదని, 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని, పాఠశాలల పరిధిలో 100 మీటర్ల వరకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నిషేధమని తెలిపారు. పొగాకుకు బానిసలైనవారు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సైకియాట్రిస్ట్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎన్సీడీ కార్యక్రమ అధికారి డా. కృష్ణ్ణమోహన్, టీకా అధికారి డా. రవికుమార్, పెద్దముద్దునూరు ప్రాథమిక ఆరో గ్య కేంద్రం వైద్యాధికారి డా. వాణి పాల్గొన్నారు.
క్యాన్సర్కు దారి తీస్తుంది..
పొగాకు వినియోగిస్తే క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి, న్యాయమూర్తి వెంకట్రామ్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కోర్టు సిబ్బందితో పొగాకు ఉత్పత్తులు వినియోగించమని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. సిగరేట్లు, బీడీలు ఇతర ఉత్పత్తులు వినియోగంతో ఊపిరితిత్తులు, నోరు, అన్నవాహిక, గర్భాశయం క్యాన్సర్లకు దారి తీస్తుందన్నారు. పొగాకు వినియోగంతో ఏటా కోటి మందికి పైగా మరణిస్తున్నారని తెలిపారు. పొగాకు ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తోందన్నారు. రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీనిధి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.