
ప్రజా ప్రభుత్వంలో ఎన్నో మార్పులు
అచ్చంపేట రూరల్: ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలనలో భాగంగా ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం భూ భారతి అమలు చేస్తోందని, అలాగే ప్రజా ప్రభుత్వంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం మండలంలోని పులిజాలలో నిర్వహించిన భూ భారతి సదస్సును ఆయన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. భూ రతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకే ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఏడాదిలోపు భూ ప్రక్షాళన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు సర్వేయర్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. లక్షలాది సంఖ్యలో ఉన్న ధరణి సమస్యలతోపాటు ఇతర భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకోవాలన్నారు. కొత్త రెవెన్యూ చట్టం భూ భారతిపై అవగాహన కల్పించడంతోపాటు పైసా ఖర్చు లేకుండా భూ సమస్యల తక్షణ పరిష్కారానికి సదస్సు వేదిక కానున్నాయన్నారు. రెవెన్యూ వ్యవస్థలో చోటుచేసుకున్న తప్పులను సరిచేసి, భూ పరిపాలనను సదస్సుల ద్వారా ప్రజల వద్దకే తీసుకెళ్తున్నామన్నారు. భూ భారతి చట్టంతో 18 రకాలైన భూమి మ్యుటేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎన్నికై అచ్చంపేటకు తొలిసారి వచ్చిన మల్లురవికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, తహసీల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.