
భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టం అమలులో భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని రైతువేదికలో లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ భారతి చట్టం అమలులో లైసెన్సుడ్ సర్వేయర్లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. మొదటి విడతలో 237 మందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. భూమి సరిహద్దులను గుర్తించడం, కొలతలను తీసుకోవడం, భూమి నమూనాలను తయారు చేయడం ద్వారా సర్వేయర్లు భూమిని సరిగా ఉపయోగించుకోవడానికి, ప్లాన్ చేయడానికి సహాయపడతారన్నారు. భూ భారతి చట్టంలో పొందుపర్చిన 5, 7, 8 సెక్షన్ల ప్రకారం భూముల క్రయ విక్రయాలు, సక్సేషన్ వంటి వాటిపై క్షేత్రస్థాయిలో భూముల సర్వే జరిపి మ్యాప్లను రూపొందించాలన్నారు. భవిష్యత్లో వివాదాలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవసాయ భూములకు కూడా సర్వే మ్యాప్లను జతచేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వం ప్రతి భూమి పార్సిల్కు ఆధార్ తరహాలో భూధార్ నంబర్ కేటాయించనుందని, దీనికి కూడా లైసెన్సుడ్ సర్వేయర్ల సేవలు అవసరమవుతాయన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పక్కనే ఉన్న పంట పొలాలను సందర్శించి, సర్వేయర్లకు సర్వే విధానంపై అవగాహన కల్పించేలా స్వయంగా సర్వే చేయించి పరిశీలించారు.