
అనంతవరంలో ఉద్రిక్తత
బల్మూర్: ఉమామహేశ్వర రిజర్వాయర్ ఆనకట్ట నిర్మాణం కోసం గురువారం మండలంలోని అనంతవరం సమీపంలో నిర్వహించిన సర్వే పనులపై రైతులు నిరసన తెలిపారు. రిజర్వాయర్ కట్ట నిర్మాణం కోసం ఇరిగేషన్ అధికారులు ఐదు టీంలుగా అంబగిరి, బల్మూర్, మైలారం, అనంతవరం గ్రామాల శివార్లలో రిజర్వాయర్ కట్ట కోసం బౌండరి పనుల భూసర్వేను చేపట్టగా అనంతవరం గ్రామానికి చెందిన రైతులు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎస్పీ శ్రీనివాసులు ఆద్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి రైతులతో మాట్లాడి శాంతిభధ్రతల సమస్యలు, సర్వేకు అడ్డంకులు సృష్టిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి భూ నిర్వాసిత రైతులను అక్కడి నుంచి పంపించడంతో ఇరిగేషన్ అధికారులు సర్వే పనులను కొనసాగించారు. కాగా భూ సర్వే పనులను అడ్డుకునేందుకు రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తారని అనుమానించిన పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వేతో ఆయా గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.