
‘సర్కారు బడి’ పిలుస్తోంది
●
నేటి నుంచి 19 వరకు బడిబాట
ప్రాధాన్య అంశాలు..
● ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు మాత్రమే పాఠాలు బోధిస్తారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నారు. అభ్యసన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం గత నెలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. సక్సెస్, పీఎంశ్రీ పాఠశాలల పేరిట ఆంగ్ల మాధ్యమంలో బోధన కొనసాగిస్తున్నారు.
● ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ విశాలమైన క్రీడా మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా పరికరాలు ఉండటంతో విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం సాధించడానికి అవకాశం ఉంటుంది.
● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించేందుకు పరిశోధనల్లో పాల్గొనే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్లో జాతీయ సైన్స్ పరిశోధన అంశాలు ప్రదర్శించేందుకు ఇన్స్పైర్ అవార్డుల పథకంతో పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకు రూ.5 వేల చొప్పున సాయం అందిస్తారు.
విజయవంతం చేస్తాం..
కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖలు, అన్ని వర్గాల ప్ర జల సమన్వయంతో బడిబాట విజయవంతం చే సేందుకు కృషిచేస్తాం. బడి బయట ఉన్న పిల్లల ను వందశాతం బడిలో చేర్పించడమే లక్ష్యం. ప్రణాళిక ప్రకారం ఎక్కువ మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి బడులను బలోపేతం చేస్తాం. బడిబాట విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం.
– రమేష్కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి
● బడీడు పిల్లలను పాఠశాలల్లో
చేర్పించేందుకు చర్యలు
● మార్గదర్శకాలు
విడుదల చేసిన విద్యాశాఖ
● అందరి భాగస్వామ్యంతో
విజయవంతం చేయాలని ఆదేశాలు
● కార్యాచరణ రూపొందించిన
జిల్లా విద్యాధికారులు
కందనూలు/ అచ్చంపేట: సర్కారు బడుల బలోపేతంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ క్రమంలో పెద్దఎత్తున విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రతి ఏటా నిర్వహించే బడిబాట కార్యక్రమానికి ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా, బడిబయటి పిల్లలతో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి 19 వరకు ‘బడిబాట’ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ విడుదల చేసింది. ప్రైవేట్కు ధీటుగా కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి పాఠశాలల్లో చేర్పించనున్నారు. ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం పేరిట జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి ఇది వరకే ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగారు.
మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు..
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, కెపాసిటీ బిల్లింగ్ పేరిట జిల్లాలోని వివిధ కేటగిరీల ఉపాధ్యాయులకు ఇటీవల మూడు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఏటా ప్రస్తుతం ఉన్న విద్యార్థుల కంటే 20 శాతం పెంచాలనేది ప్రభుత్వ ఉద్దేశం. పాఠశాలల ప్రారంభంలోపు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, ఉచిత దస్తులు అందించడంతోపాటు విద్యార్థుల నమోదును పెంచేందుకు కలెక్టర్ క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. సామాజిక సేవా సంస్థలు, ఎన్జీఓలు తదితర వర్గాలను సమన్వయపరిచి బడిబాటను విజయవంతం చేయాలని సూచించారు.
బడిబాట కార్యక్రమాలు ఇలా..
● ఈ నెల 6న ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో గ్రామసభ నిర్వహిస్తారు.
● 7న ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి బడీడు పిల్లలను గుర్తించాలి.
● 8, 9, 10 తేదీల్లో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన, బడిమానేసిన పిల్లలను గుర్తించి చేర్పించడం, ప్రత్యేకావసరాల పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించాలి.
● 11న నాలుగు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష
● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం, పిల్లలకు పాఠ్య, రాత పుస్తకాలు, ఉచిత దుస్తులు అందజేయాలి.
● 13న సామూహిక అక్షరభ్యాసం, బాలసభ
● 16న తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాల దినోత్సవం, తరగతి గదిలో విషయాల వారీగా అభ్యసనా సామర్థ్యాల గోడపత్రుల ప్రదర్శన, పిల్లలు రూపొందించిన చార్టులతో గదుల అలంకరణ, చదవడం, గణిత సంబంధిత వాటిపై క్విజ్ పోటీలు నిర్వహించాలి.
● 17న సమీకృత విద్య, బాలికా విద్యాదినోత్సవం నిర్వహణ, బాలికా వివాహాలు, చిన్నారులపై వేధింపులను అరికట్టేందుకు ప్రతిజ్ఞ చేయాలి.
● 18న తల్లిదండ్రులు, పోషకులు, వార్డు సభ్యులను ఆహ్వానించి తరగతి గదుల్లో చేపట్టిన డిజిటలీకరణ, సౌకర్యాలు చూపించడం, మొక్కల పెంపకం ప్రాధాన్యతను పిల్లలకు వివరించాలి.
● 19న బడిబాట ముగింపు సందర్భంగా పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహించాలి.

‘సర్కారు బడి’ పిలుస్తోంది