
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
సమయం: శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు
కోడేరు: భూ సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం మండలంలోని తీగలపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారానికి శ్రద్ధ చూపాలని, దరఖాస్తు ఫారాలను ఒకరోజు ముందుగానే గ్రామంలో పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్న గ్రామంలో ఒకరోజు ముందుగానే ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు టాంటాం వేయించాలన్నారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించాలని.. నోటీసులు ఇవ్వాల్సి ఉంటే వెంటనే జారీ చేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ విజయ్కుమార్, జూనియర్ అసిస్టెంట్ సురేందర్, మహేష్ తదితరులు ఉన్నారు.
కొనుగోలు కేంద్రం తనిఖీ..
మండలంలోని పస్పులలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజు ఎంత ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని ఏపీఎం పార్వతమ్మను ఆదేశించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు చివరి దశలో ఉందని.. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతుల నుంచి ధాన్యం సేకరిస్తామని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని.. రైతులు అధైర్యపడొద్దని సూచించారు. ధాన్యం కొనుగోలులో సిబ్బంది అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. దశల వారీగా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని లబ్ధిదారులకు తెలిపారు.