భూ సేకరణ ప్రక్రియ వేగిరం చేయాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణ ప్రక్రియ వేగిరం చేయాలి : కలెక్టర్‌

Jun 7 2025 12:23 AM | Updated on Jun 7 2025 12:23 AM

భూ సే

భూ సేకరణ ప్రక్రియ వేగిరం చేయాలి : కలెక్టర్‌

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో కొనసాగుతున్న కేఎల్‌ఐ, పాలమూరు– రంగారెడ్డి, మార్కండేయ, డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు తదితర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 14 ప్యాకేజీల పరిధిలో 11,930.22 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 11,899.07 పూర్తయ్యిందని, మిగిలిన 31.15 ఎకరాలు వెంటనే చేపట్టాలన్నారు. అలాగే కేఎల్‌ఐ పరిధిలోని 28వ ప్యాకేజీకి సంబంధించి 27 ఎకరాలు, 29వ ప్యాకేజీలో 242 ఎకరాలు, 30వ ప్యాకేజీలో 256 ఎకరాలు, మార్కండేయ ఎత్తిపోతలకు సంబంధించి 104.42 ఎకరాలు ఉందని, దీనిని ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పరిధిలో 244.15 ఎకరాలు, కర్నెతండా ప్రాజెక్టుకు సంబంధించి 3.28 ఎకరాల భూమిని త్వరగా సేకరించాలన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ అధికారులు శ్రీధర్‌, పార్థసారథి, మురళి, జిల్లా సర్వే ల్యాండ్‌ అధికారి నాగేందర్‌, ఆర్డీఓలు శ్రీను, మాధవి, సురేష్‌, భూ సేకరణ విభాగం కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ నారాయణ, కార్తీక్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించారు.

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. బక్రీద్‌ను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ పండుగను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

మాదకద్రవ్యాలకు

బానిస కావొద్దు

నాగర్‌కర్నూల్‌ క్రైం: మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో డ్రగ్స్‌, గంజాయికి సంబంధించి వీడియో సాంగ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాల మండలం అప్పాయపల్లి గ్రామవాసి, రైటర్‌ వేముల శివరాంసాగర్‌, ప్రొడ్యూసర్‌ మహేష్‌ గంజాయి, మాదక ద్రవ్యాలపై వీడియో సాంగ్‌ చేయడంతో ఎంతో మందికి అవగాహన కలుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగుతోపాటు విక్రయాలు జరిగితే వెంటనే పోలీసులకు (సెల్‌ నం.87126 57709) సమాచారం అందించాలన్నారు. ఏఎస్పీ రామేశ్వర్‌, డీఎస్పీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు చివరి అవకాశం

కల్వకుర్తి టౌన్‌: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో 2010– 2016 మధ్యకాలంలో డిగ్రీ ఏదైనా సబ్జెక్టులో ఫెయిలైన వారు జూలైలో జరిగే పరీక్షలలో రాసే విధంగా అవకాశం యూనివర్సిటీ కల్పించిందని ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శార్వాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే వారంతా ఫీజుకు అదనంగా ప్రతి సబ్జెక్టుకు రూ.3 వేలు ఈ నెల 16లోగా చదువుకున్న కళాశాలలో చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షల కోఆర్డినేటర్‌ రాజును కలిసి తెలుసుకోవాలని కోరారు.

అరుణాచలానికి

ప్రత్యేక బస్సు

కందనూలు: జిల్లాకేంద్రం నుంచి అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్సు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్‌ యాదయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సాయంత్రం 8 గంటలకు నాగర్‌కర్నూల్‌ బస్టాండ్‌ నుంచి బయలుదేరి మంగళవారం రాత్రి అరుణాచలానికి చేరుకుంటుంది. మళ్లీ బుధవారం సాయంత్రం 5 గంటలకు అరుణాచలంలో బయలుదేరి గురువారం ఉదయం నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటుందని, ఈ అవకాశాన్ని అరుణాచలం వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

భూ సేకరణ ప్రక్రియ వేగిరం చేయాలి : కలెక్టర్‌ 
1
1/1

భూ సేకరణ ప్రక్రియ వేగిరం చేయాలి : కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement