
త్యాగానికి ప్రతీక బక్రీద్
కందనూలు: ముస్లింలు జిల్లావ్యాప్తంగా బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. శనివారం ఉదయమే జిల్లాకేంద్రం సమీపంలోని శ్రీపురం రోడ్లో ఉన్న ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా జామియా నిజామియాకు చెందిన మతపెద్దలు బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. అల్లా ముస్లింలకు ప్రసాదించిన ఐదు అంశాల్లో హజ్ కూడా ప్రధానమైందన్నారు. బక్రీద్ ప్రాముఖ్యతను గుర్తుంచుకొని ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ ఖుర్బానీ ఇవ్వాలని ఖురాన్ చెబుతోందని.. ఇబ్రహీం అలై సలాం త్యాగనీరతికి ప్రతీక అయిన బక్రీద్ నిష్టతో జరుపుకోవాలని సూచించారు. అల్లా కరుణ ఉన్నంత వరకు సమాజంలో మంచి జరుగుతుందని.. ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లుతోందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్కర్నూల్ ఎమ్యెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి హాజరై ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతానికి మూల స్తంభాలైన ఇమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ సూత్రాలను పాటిస్తూ ముస్లింలు సోదర భావంతో పండుగలు జరుపుకోవడం హర్షణీయమన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చంపేట, కల్వకుర్తిలో ఎమ్మెల్యేలు డా. వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా ఈద్గాల వద్ద
ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
పండుగ శుభాకాంక్షలు తెలిపిన
ప్రజాప్రతినిధులు

త్యాగానికి ప్రతీక బక్రీద్