
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ పీవీ గౌతమ్ అన్నారు. మంగళవారం జిల్లాలో ఎంపిక చేసిన పైలెట్ ప్రాజెక్టు గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని 20 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రామ కమిటీలు గుర్తించిన వారితోపాటు ఎవరైనా నిరుపేదలు ఉంటే పూర్తి వివరాలు తీసుకొని ఇళ్లు మంజూరు చేయాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో యువ వికాసం ద్వారా సెంట్రింగ్, ఇటుకల తయారీ యూనిట్ల స్థాపనకు కృషి చేయాలని, తద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు యూనిట్లు నెలకొల్పే యువకులకు మంచి లాభదాయకంగా ఉంటుందన్నారు. గ్రామాల్లో ఎవరూ పూరి గుడిసెల్లో నివాసం ఉండకూడదనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో రెండో దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఈ నెల 9లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం లబ్ధిదారులకు ఈ నెల 6 వరకు మంజూరు పత్రాలు అందజేయాలన్నారు. అంతకు ముందు వారు నాగర్కర్నూల్ మండలంలోని గగ్గలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి రూ.5 లక్షలతోనే మంచి ఇంటిని నిర్మించుకోవచ్చని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, హౌసింగ్ పీడీ సంగప్ప, డీఆర్డీఓ చిన్న ఓబులేసు, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులనువినియోగించుకోండి
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నాగర్కర్నూల్ మండలంలోని వెంకటాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ, రైతుల సందేహాలను నివత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 14లోపు భూ భారతిలో వచ్చిన అన్ని అర్జీలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్నారు. నిర్ణీత షెడ్యూల్ను అనుసరిస్తూ గ్రామాల్లో అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.