
లాభదాయక పంటల వైపు దృష్టిసారించాలి
నాగర్కర్నూల్: రైతులు లాభదాయకమైన పంటల వైపు దృష్టిసారించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం నాగర్కర్నూల్, వ్యవసాయ క్లస్టర్ పరిధిలో దేశిఇటిక్యాల గ్రామంలో రైతు రమేష్రెడ్డి తన 5 ఎకరాల పొలంలో కొనసాగుతున్న పత్తి విత్తనాలు నాటుతున్న వ్యవసాయ పనులను కలెక్టర్ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల నుంచి పంట దిగుబడి, సాగుకు వినియోగిస్తున్న విత్తనాలు, మందుల కొనుగోలులో సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పంట దిగుబడి లాభదాయకంగా సాగాలంటే వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని, అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా రైతులకు తమ పంటలను లాభదాయకంగా ఎలా సాగు చేయాలనే వ్యవసాయ మెలకువలను పాటించడంతోపాటు అధికంగా పురుగు మందులు వాడకూడదన్నారు. పత్తితోపాటు లాభదాయక పంటలు, హార్టికల్చర్ పంటలను కూడా సాగు చేయాలని, ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్, ఏడీ పూర్ణచంద్రారెడ్డి, ఏఓ రాజు, రైతులు కృష్ణారెడ్డి, బాల్రెడ్డి, నిరంజన్ తదితరులున్నారు.
సమన్వయంతో పనిచేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, డీఎఫ్ఓ రోహిత్ గోపిడితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ఆర్ఓఎఫ్ఆర్, ఆర్ఓఎఫ్ఆర్ కింద భూమి హక్కులు కలిగి ఉన్న గిరిజన రైతుల ఆర్థిక, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేసి ఆసక్తి కలిగిన గిరిజనుల రైతులకు ఈ పథకం ఆవశ్యకత గురించి వివరించాలన్నారు.