
ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలి
నాగర్కర్నూల్ రూరల్: ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, పట్టణ పేదలకు ఉపాధి పని పెట్టాలని, రోజు కూలి రూ.600, ఉపాధి పని దినాలు 200 రోజులు కల్పించాలని, ఉపాధి హామీ చట్టం రక్షణ అమలు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని, కొత్త జాబ్ కార్డులు, కూలీలకు పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు ఆధార్ కార్డు లింక్ చేసి ఆన్లైన్ చెల్లింపులు చేయాలన్నారు. సీనియర్ మేటీలను ప్రత్యేకంగా గుర్తించాలని సంవత్సరం మొత్తం పనులు కల్పించాలని వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించాలని, ప్రమాదం జరిగితే ఉచిత వైద్యంతోపాటు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. ధర్నా కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు హాజరై మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు దేశ్యానాయక్, బాల్రెడ్డి, శ్రీనివాస్, శివశంకర్, వరప్రసాద్, మధు, నాగరాజు, బాలస్వామి, సుభాష్, భాస్కర్, కాశన్న, అశోక్, అరుణ, శాంతమ్మ, వెంకటమ్మ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.