పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య | - | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య

May 29 2025 12:31 AM | Updated on May 29 2025 12:31 AM

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య

కందనూలు: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు ఇంటర్‌ విద్య ఎంతో కీలకం. చాలా మంది విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ అభ్యసించాలనే కోరిక ఉంటుంది. కానీ కార్పొరేట్‌ విద్య పేదలకు అందని ద్రాక్షగా మారింది. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో పదో తరగతి చదివి ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ చదివేందుకు సహకారం అందిస్తోంది. కార్పొరేట్‌ విద్యా పథకానికి ఎంపికై న ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ. 36వేలు చెల్లిస్తుంది. ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌ పరిగణనలోకి తీసుకొని 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్‌ కళాశాలలకు ఎంపిక చేయనుంది. దరఖాస్తు గడువు ఈ నెల 31వ తేదీ వరకు ఉంది.

అర్హులు ఎవరంటే..

పదో తరగతిలో 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ, నవోదయ, గురుకుల విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు ఉచితంగా కార్పొరేట్‌ విద్య చదువుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే. ఎంపికై న వారికి కేటాయించిన కార్పొరేట్‌ కళాశాలల వివరాలతో కూడిన సమాచారం పంపిస్తారు. మీ సేవ కేంద్రాల ద్వారా టీఎస్‌ ఈపాస్‌ పోర్టల్‌లో telanganaepass.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి పూర్తి వివరాలతో పాటు పదో తరగతిలో సాధించిన మార్కుల ధ్రువపత్రం, ఇతర పత్రాలు, పాస్‌ఫొటో సైజ్‌ ఫొటో జతచేయాలి. నాలుగు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదివిన పాఠశాలల నుంచి తీసుకున్న ధ్రువపత్రాలతో పాటు తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పత్రాన్ని దరఖాస్తుతో సమర్పించాలి. గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2లక్షలకు పైగా వార్షిక ఆదాయం మించకుండా ఉండాలి.

సద్వినియోగం చేసుకోవాలి..

ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్ల పాటు కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచిత విద్య, వసతి కల్పించబడతాయి. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి.

– రాంలాల్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ అధికారి

కార్పొరేట్‌ విద్యా పథకంతో అవకాశం

ఎస్‌ఎస్‌సీ మెరిట్‌ ఆధారంగా ఎంపిక

ఈ నెల 31 వరకు దరఖాస్తు గడువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement