
గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు చేయడంతో పాటు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లాలోని సిద్ధాపూర్, పదర, అమ్రాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో పట్టుబడిన గంజాయిని బుధవారం ఎస్పీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలంలోని బయో వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కంపెనీలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం పోలీసుశాఖ కృషి చేస్తోందన్నారు. 2019లో సిద్ధాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో 29.75 కిలోల గంజాయి, 2023లో పదర మండలంలో 476 గంజాయి మొక్కలు, 2024లో అమ్రాబాద్ మండలంలో 5 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎస్పీ వెంట జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ ఉపేందర్రావు, ఆర్ఎస్ఐ ప్రశాంత్, పీసీ అరవింద్ ఉన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే సహించం..
రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే సహించమని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని సూచించారు. రైతులు కొనుగోలుచేసే విత్తనాలు, ఎరువులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ఎక్కడైనా నకలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.