
ఎల్ఆర్ఎస్ గడువు మళ్లీ పొడిగింపు
అచ్చంపేట: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబ ద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్–2020 స్కీం కింద ఫీజు చెల్లిపు గడువు ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 25 శాతం రాయితీతో కూడిన ఫీజు చెల్లింపు గడువు గత నెల 30న ముగియగా దాన్ని ఈ నెల 3 వరకు పొడిగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి టీకే శ్రీదేవి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే నెల గడువు పొడిగించగా జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ఫీజు చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరిదిద్దాల్సిన సంబంధిత అధికారులు మధ్య సమన్వయం కొరవడటం వంటి కారణాలతోనే ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎల్ఆర్ఎస్ కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ ఫీజు చెల్లించేందుకు మాత్రం చాలామంది ముందుకు రాలేదు. సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం చేకూరుతుందని భావించినా నిరాశే ఎదురైంది. పొడిగించిన గడువుకు అవకాశం మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో దరఖాస్తుదారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
ఇందులో
అర్హులుగా గుర్తించినవి 34,756
ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు 44,280
ఫీజు చెల్లించిన వారు 7,453
ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.13.18 కోట్లు
ఎల్ఆర్ఎస్ ప్లాట్లు సర్వే చేస్తున్న
అధికారులు (ఫైల్)
ఈ నెల 3 వరకు అవకాశం
కల్పించిన ప్రభుత్వం
సద్వినియోగం చేసుకోండి
రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం గడువు మూడు రోజులు పొడిగించింది. 25 శాతం రాయితీ సదుపాయాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. ఎఫ్టీఎల్, నిషేధిత సర్వే నంబర్లు మినహా ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రెగ్యులరైజేషన్ రుసుం నిర్ణయించారు. వివిధ కారణాలతో రెగ్యులరైజేషన్ చేసుకోలేకపోయిన వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.