
అద్దె బస్సుల డ్రైవర్ల సమ్మె విరమణ
అచ్చంపేట: అచ్చంపేట ఆర్టీసీ డిపో ఎదుట గత ఐదురోజులుగా అద్దె బస్సుల ప్రైవేట్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె ఆదివారం ముగిసింది. కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అద్దె బస్సుల యాజమాన్యం డ్రైవర్ల శ్రమ దోపిడీని అరికట్టాలని తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హయ్యర్ అద్దె బస్సు డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. సమ్మెతో దిగివచ్చిన యాజమాన్యాలు డ్రైవర్లకు గతం కంటే రూ.3 వేలు ఎక్కువ ఇచ్చేందుకు అంగీకరించారు. జీతాలు పెరగడంతో డ్రైవర్లు సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్నాయక్, అద్దె బస్సు ప్రైవేట్ డ్రైవర్ల నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ అద్దె బస్సు యాజమాన్యం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించారని చెప్పారు. సమ్మె చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగడంతో ఆర్టీసీ డీఎం జోక్యం చేసుకొని యాజమాన్యాలతో చర్చలు జరపడం వల్ల వేతనాలు పెరిగాయన్నారు. కార్యక్రమంలో నాయకులు రాములు, శ్రీహరి, అనిల్, నాగరాజు, బాలయ్య, చంద్రయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.