
కల్వకుర్తి: వేరుశనగ ధర నిలకడగా ఉండడంతోపాటు గురువారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో క్వింటాలుకు రూ.100 పెరిగింది. ఈ క్రమంలో 157 మంది రైతులు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు 6,049 బస్తాలలో 1,815 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి తీసుకువచ్చారు. అత్యధికంగా క్వింటాలు రూ.7,319, మధ్యస్తంగా రూ.6,785, తక్కువగా రూ.4,504 చొప్పున పలకగా.. కందులు క్వింటాల్ రూ.9,204, పెబ్బర్లు క్వింటాల్ రూ.6,159 ఒకే ధర లభించినట్లు మార్కెట్ కార్యదర్శి భగవంతు చెప్పారు.
ఆర్థిక అక్షరాస్యతపై వ్యాసరచన పోటీలు
నాగర్కర్నూల్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్, సైబర్ పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 24న 8, 9వ తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న 8, 9వ తరగతి విద్యార్థులకు రాత్రికి రాత్రే నేను మిలినియర్గా మారితే ఆ డబ్బులు ఎలా వినియోగిస్తా అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. పొదుపు, చక్ర వడ్డీ యొక్క శక్తి పెంపు అవగాహనకై స్లోగన్ పోటీలు, డిజిటల్, సైబర్ పరిశుభ్రతపై పోస్టర్ కాంపిటీషన్లను ఈ నెల 24న నిర్వహించి.. ప్రతి పాఠశాల నుంచి అత్యుత్తమమైన వ్యాసరచన, స్లోగన్స్ పోస్టర్ ఎంపిక చేసి అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు డీఈఓ కార్యాలయ జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డికి అందజేయాలని ఆదేశించారు.
నిబంధనలు పాటించకుంటే చర్యలు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని మెడికల్ దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ రవికిరణ్ అన్నారు. గురువారం రాత్రి జిల్లాకేంద్రంలోని శశి అర్థోపెడిక్ ఆస్పత్రిలోని మెడికల్ దుకాణాన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మెడికల్ దుకాణాల్లో తప్పనిసరిగా ఫార్మసిస్టులనే సిబ్బందిగా నియమించాలని చెప్పారు. అనుమతిలేని మందులతోపాటు కాలం చెల్లిన మందులను విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
