చేప పిల్లల పంపిణీ
వాజేడు : మండలంలోని మత్స్యకార సొసైటీలకు సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లా మత్స్యకార సంస్థ ఎఫ్ఓ రమేశ్, పెసా జిల్లా నాయకుడు కొమరం ప్రభాకర్ చేతుల మీదుగా 2.10 లక్షల చేప పిల్లలను అందజేశారు.15 గ్రామాలకు చేప పిల్లలను పంపిణీ చేసి చెరువుల్లో జాగ్రత్తగా వదిలారని వారు తెలిపారు.
ములుగు : బీసీలకు 42శాతం రిజర్వేషన్ దక్కడం లేదనే మనస్తాపంతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారికి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం శాంతిర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమానికి విశ్వబ్రాహ్మణ బిడ్డ అమరుడయ్యాడని సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్కతుర్తి రాజన్న తెలిపారు. నాడు తెలంగాణ కోసం, నేడు బీసీల రిజర్వేషన్ల సాధనకు విశ్వకర్మలే అమరులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాంతి ర్యాలీలో సంఘం నాయకులు కడివెండి వీరాచారి, కాగితపు శ్రీనివాస్, శ్రీలమంతుల నరసింహచారి, నారాయణ, మహేశ్, బస్వోజు రమేశ్, శంకరాచారి, రవీంద్ర చారి, నాగరాజు, గుంటోజు పావని తదితరులు పాల్గొన్నారు.
వాజేడు: ఓ వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన పెద్ద గొళ్లగూడెం గ్రామంలో జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై జక్కుల సతీశ్ ప్రకారం.. గ్రామానికి చెందిన గొంది సాంబశివరావు(40) అదే గ్రామానికి చెందిన సమ్మయ్య అనారోగ్యంతో మృత్యువాత పడిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొని హైవే పైనుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటి సమీపంలోకి రాగానే వ్యాన్ వచ్చి ఢీ కొట్టింది. దీంతో సాంబశివరావు ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు గౌరమ్మ, జగన్నాథరావుతో పాటు బంధువులు అక్కడికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలంలోని వివరాలను సేకరించారు. పోస్టు మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఏటూరునాగారం సివిల్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు.
కాటారం(మహాముత్తారం): ప్రభుత్వ వైద్యశాలలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో నిరంతరం వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి మందుల నిల్వ, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పెగడపల్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను సందర్శించి సౌకర్యాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. డీహెంఎచ్ఓ వెంట జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ సందీప్, డాక్టర్ దీప్తి, డీడీఎం మధుబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చేప పిల్లల పంపిణీ
చేప పిల్లల పంపిణీ


