
కొత్త కార్డులొచ్చాయ్..
వెంకటాపురం(ఎం): ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేద ప్రజలకు ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాలు ఉండగా 222 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రభుత్వం నూతన రేషన్కార్డుల కోసం దరఖాస్తులకు అవకాశం ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది అప్లికేషన్ చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 6,207 రేషన్ కార్డులను నూతనంగా మంజూరు చేశారు. ఈనెల 14న సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నూతన కార్డులను లబ్ధిదారులకు అందించగా, శుక్రవారం వెంకటాపురం(ఎం) మండలంలోని లక్ష్మీదేవిపేట, గోవిందరావుపేట మండలంలో రాష్ట్రపంచాయితీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క లబ్ధిదారులకు కొత్తకార్డులను అందజేశారు.
పేదలకు అందనున్న సంక్షేమ పథకాలు
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకోవడం తెలిసిందే. దీంతో ఇన్నాళ్లు రేషన్కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు అనేకమంది దూరమయ్యారు. ఈక్రమంలో ప్రస్తుతం నూతన కార్డుల జారీతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 97,634 రేషన్కార్డులు ఉండగా.. వాటిలో 20,609 మందిని కుటుంబసభ్యులను నూతనంగా చేర్చారు. దీంతోపాటు 6,207 కొత్తకార్డులు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతోపాటు మహాలక్ష్మి పథకంలో రూ.500 కే అందించే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను పొందనున్నారు.
నిరీక్షణకు తెర..
కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొన్నేళ్లుగా నిలిచిపోయినట్లు ప్రజలు పేర్కొంటున్నారు. కార్డుల్లో చేర్పులు, మార్పులకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వాలు అందించే పథకాలన్నింటికీ రేషన్కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో వేలాదిమంది కార్డులు లేక పథకాలకు దూరమయ్యారు. రేషన్ బియ్యంతోపాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం కూడా అందుకోలేకపోయారు. పలుమార్లు మీసేవలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కార్డు మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2025 జనవరి 26న ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని పైలెట్గా ఎంపిక చేసి అర్హులైన పేదలకు రేషన్ కార్డులను మంజూరు చేసింది. తాజాగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి విచారణ చేపట్టి అర్హులైన వారందరికీ కార్డులు అందజేస్తున్నారు. అయితే మూడు నెలల రేషన్ కోటా ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో కొత్తవారికి సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం అందే అవకాశం ఉంది.
జిల్లాలో 6,207 రేషన్కార్డులు మంజూరు
సెప్టెంబర్ నుంచి బియ్యం సరఫరా
పేదలకు అందనున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
అర్హులందరికీ కార్డులు అందిస్తాం
జిల్లాలో అర్హులైన ప్రతికుటుంబానికి రేషన్ కార్డు అందిస్తాం. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ. జిల్లాలో 6,207 రేషన్కార్డులు కొత్తగా మంజూరయ్యాయి. అర్హులందరికీ రేషన్ కార్డులు అందించి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం.
– దివాకర టీఎస్, కలెక్టర్
రేషన్కార్డు పేదల హక్కు
రేషన్కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యం అందించి వారి కడుపు నింపడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి పేద కుటుంబానికి రేషన్కార్డు అందిస్తాం. రేషన్ కార్డు పొందడం పేదల హక్కు. జిల్లాలో 222 రేషన్ షాపుల ద్వారా పేదలకు మూడునెలల సన్నబియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి అందించింది. సన్నబియ్యం పంపిణీతో పేదలు సంతోషంగా ఉన్నారు.
– సీతక్క, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి

కొత్త కార్డులొచ్చాయ్..

కొత్త కార్డులొచ్చాయ్..