
బీరన్నకు బోనాలు
మంగపేట: మండల పరిధిలోని కమలాపురంలో బీరలిగేశ్వరస్వామి(బీరన్న)కి కురమలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదివారం సాయంత్రం బోనాలు సమర్పించారు. ప్రతిఏటా తొలి ఏకాదశి రోజు కమలాపురంలోని బీరన్న ఆలయంలో బోనాలు సమర్పించి యాటపోతులను బలివ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే గ్రామ కురమ పెద్దల ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీరన్నకు బోనం వండి కుటుంబ సభ్యులతో కలిసి మహిళలు బోనాలు ఎత్తుకుని డోలు వాయిద్యాలతో బీరన్న ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కులపెద్దలు పోతురాజు రమేష్, మల్లిఖార్జున్, యాకన్న, ఇండ్ల లక్ష్మ ణ్, యార సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.