
హాజరు అంతంతే!
ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టారు. ఇన్నిరోజులు బోసిపోయిన పాఠశాలలు విద్యార్థుల రాకతో కళకళలాడాయి. ఉదయాన్నే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల వద్ద దింపారు. పలు బుక్స్టాళ్లు, షూమార్టులు, బట్టల షాపులు విద్యార్థులతో కిక్కిరిశాయి.
తొలిరోజు తక్కువే..
జిల్లాలోని పది మండలాల్లో ప్రాథమిక పాఠశాలలు 269 ఉండగా విద్యార్థులు 7,251 మంది ఉన్నారు. అలాగే అప్పర్ ప్రైమరీ పాఠశాలలు 45ఉండగా 1,937, హైస్కూళ్లు 53మంది ఉండగా విద్యార్థులు 8,361మంది విద్యనభ్యసిస్తున్నారు. తొలిరోజు మాత్రం సుమారుగా 20శాతం మంది విద్యార్థులే హాజరయ్యారు. పిల్లలు ఎక్కువగా రాకపోవడంతో ఉపాధ్యాయులు సైతం పాఠాలు బోధించలేదు. వచ్చిన వి ద్యార్థులు స్కూల్ ఆవరణలో ఆడుతూ, పాడుతూ కనిపించారు. సర్కారు పాఠశాలలకు భిన్నంగా ప్రై వేట్ స్కూళ్లు విద్యార్థులతో కళకళలాడాయి. అధికశాతం విద్యార్థులు హాజరయ్యారు. పలు సర్కారు బడుల్లో తాగునీరు, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు దర్శనమిచ్చాయి.
పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ
ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను అందించారు. అలాగే విద్యార్థులకు యూనిఫాం సైతం అందించారు. తొలిరోజు ఏటూరునాగారంలోని ప్రభు త్వ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి సీతక్క యూనిఫామ్ అందించారు. అలాగే డీఈఓ పాణిని బండారుపల్లి పాఠశాల, పస్రా, తాడ్వాయి పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్ అందజేశారు.
930 నూతన అడ్మిషన్లు
జిల్లాలోని పది మండలాల పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం రోజున ఒకటవ తరగతిలో 930 నూతన అడ్మిషన్లు నమోదయ్యాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన చేపడుతుండడంతో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.
జిల్లాలో పునఃప్రారంభమైన పాఠశాలలు
తొలిరోజు పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థుల అనాసక్తి
పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, పుస్తకాల పంపిణీ

హాజరు అంతంతే!