రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

Jun 13 2025 4:55 AM | Updated on Jun 13 2025 4:55 AM

రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

గోవిందరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఉద్యమించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో తెలంగాణ రైతు సంఘం రెండో జిల్లా మహాసభ చిట్టెం ఆదినారాయణ అధ్యక్షతన గురువారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మొదటగా మండల కేంద్రం నుంచి పీఎస్‌ఆర్‌ గార్డెన్‌ వరకు పెద్ద ఎత్తున రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుండు సత్యనారాయణ జెండా ఆవిష్కరించి మహాసభ సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా రైతులను మోసం చేస్తూ కాలం గడుపుతుందన్నారు. ఎన్నికల ముందు గిట్టుబాటు ధర చట్టం తెస్తామని హామీనిచ్చి రైతులను మోసం చేశారని వివరించారు. కార్పోరేట్లకు మాత్రం అనుకూలంగా చట్టం తెచ్చి వేలాది ఎకరాల భూములను పాలకులు అప్పజెప్పుతున్నారని వివరించారు. నూతనంగా జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ ముసాయిదా పేరుతో కార్పోరేట్లకు అనుకూలంగా చట్టం తెచ్చారని వివరించారు. రైతు భరోసాను రైతులు కాస్తు చేస్తున్న భూములన్నింటికి ఇస్తామని చెప్పి మూడెకరాల వరకే రైతు భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ ఖరీఫ్‌లో అసలు ఇస్తారో, ఇవ్వరో కూడా క్లారిటి లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, అంతే కాకుండా నకిలీ విత్తనాలతో మొక్కజొన్న రైతులు నష్టపోయారని తెలిపారు. వారికి ఎకరాకు లక్ష రుపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో పోడు భూములకు పట్టాలివ్వాలని సుదర్శన్‌రావు కోరారు. ఈ కార్యక్రమంలో సూడి కృష్ణారెడ్డి, తుమ్మల వెంకట్‌ రెడ్డి, ఎండి గఫూర్‌, తీగల ఆదిరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, సోమా మల్లారెడ్డి, గుండు లెనిన్‌, నాగేశ్వరరావు, సుధాకర్‌, చంద్రశేఖర్‌, సత్యం తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

సుదర్శన్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement