
మోగనున్న బడిగంట
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ములుగు రూరల్: వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈమేరకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు చెత్తాచెదారం తొలగించి అందంగా ముస్తాబు చేశారు. ఈ మేరకు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు మామిడాకుల తోరణాలు కట్టారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన చేపట్టే విధంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో వేసవిలో రెండు విడతలుగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు.మొదటి రోజే పిల్లలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందించేందుకు అన్నీ సిద్ధం చేశారు.
పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు సిద్ధం
జిల్లాలోని 10మండలాలు ఉండగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 555 ఉన్నాయి. వీటిల్లో విద్యార్థిని విద్యార్థులు గతేడాది 29,117మంది విద్యను అభ్యసించారు. అదే విధంగా పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యవంతంగా తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, మధ్యాహ్నా భోజన పథకం పటిష్టంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
విద్యార్థుల పెంపునకు
బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన ఉంటుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచుతున్నారు.
గోవిందరావుపేట: పస్రా జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పారిశుద్ధ్య పనులు
విద్యార్థుల సంఖ్య పెంపునకు బడిబాట
విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు

మోగనున్న బడిగంట