
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ములుగు రూరల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూశాఖ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు మండల పరిధిలోని ఇంచర్లలోని ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు 2.54లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం 92వేల డబుల్ బెడ్ రూం ఇళ్లకు టెండర్లు పిలిచి 60వేలు మాత్రమే పూర్తి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి కల నెరవేర్చేందుకు ప్రతీ ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ములుగు నియోజకవర్గానికి అత్యధికంగా 5 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించినట్లు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.22,500 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి రెవెన్యూ అధికారులు ఉచిత ఇసుకకు సంబంధించిన టోకెన్లు అందించాలని సూచించారు.
నిరుపేదల కలను నెరవేర్చింది
కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి సీతక్క
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి నిరంతరం పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను పెద్దఎత్తున అందించారని వెల్లడించారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 4.50లక్షల ఇళ్లను మొదటి విడుతలో అందిస్తున్నారని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ నియోజనవర్గంలో డబుల్బెడ్రూం ఇళ్లను అందించలేకపోయారని తెలిపారు. ములుగు నియోజకవర్గానికి మొదటి విడతలో 5వేల ఇళ్లను అందించడంతో ప్రతిపక్ష పార్టీ నాయకలు ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళా సంఘాల సభ్యులు వ్యాపారాలు చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పేదోడి సొంతింటి కలను నిజం చేస్తాం
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం