
రైతుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
గోవిందరావుపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల హక్కులను కాలరాస్తుందని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని పీఎస్ఆర్ గార్డెన్లో నేడు నిర్వహించనున్న రైతుసంఘం మహాసభకు రైతులు తమ హక్కుల సాధనకు కదలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర రైతు సంఘానిదని తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతో దొడ్డిదారిన మరో చట్టం తీసుకువచ్చి రైతులను దగా చేయడం కోసం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ చట్టంపై రైతాంగానికి అవగాహన కల్పించడం కోసం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పోతినేని సుదర్శన్ హాజరుకానున్నట్లు వెల్లడించారు. ప్రతీ రైతు ఈ సదస్సుకు హాజరు కావాలని విజ్ఙప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుండు రామస్వామి, తీగల ఆదిరెడ్డి, కన్నోజు సదానందం, మోటం సాంబయ్య, భీమేష్, నగేష్, కృష్ణ, సూర్యనారాయణ, శ్రీను, సారయ్య, ధర్మారెడ్డి, లెనిన్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం కమిటీ
సభ్యుడు వెంకట్రెడ్డి