
జాడలేని వాన
వెంకటాపురం(ఎం): ప్రకృతి ఏదో ఒక రూపంలో రైతాంగాన్ని దెబ్బతీస్తూనే ఉంది. రోళ్లు పగిలే ఎండలు కొట్టాల్సిన రోహిణీ కార్తెలో ముందస్తు వర్షాలు పడడంతో రైతన్నలు మురిసిపోయారు. నైరుతి రుతుపవనాలు కూడా ముందస్తుగానే రాష్ట్రానికి చేరుకోవడంతో పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే దీమాతో జిల్లాలోని రైతులు మే నెలలోనే సాగుకు సన్నద్ధమయ్యారు. వేలాది రూపాయలు వెచ్చించి దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటారు.
పది రోజులుగా..
మే మాసం చివరి వారంలో వేలాది ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలను నాటి నైరుతి రుతుపవనాల మీద గంపెడాశలు పెట్టుకున్నారు. జూన్ తొలివారంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో నాటిన విత్తనాలు 60 శాతం మాత్రమే మొలకెత్తాయి. పది రోజులుగా వర్షాలు జాడలేకపోవడంతో మొలకెత్తిన విత్తనాలు సైతం ఎండలకు వాడిపోతున్నాయి. రైతులంతా వరుణుడి మీద భారం వేసి వెయ్యికళ్లతో వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
జూన్ 12తర్వాతనే వర్షాలు కురిసే అవకాశం
జూన్ 8న మృగశిర కార్తె ప్రారంభమైన జూన్ 12 తర్వాతనే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వానకాలం సీజన్లో జిల్లాలో 27,143 ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకే సుమారు 6 నుంచి 8 వేల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలను నాటారు. వర్షాలు కురవకపోతే నాటిన విత్తనాలతో పాటు, మొలకెత్తిన మొక్కలు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పది రోజులుగా కురవని వర్షం
వేలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు
విత్తిన రైతులు
60 శాతమే మొలకెత్తిన గింజలు
ఎండ తీవ్రతకు వాడిపోతున్న మొక్కలు
ముందస్తు సాగుకే ప్రాధాన్యం
వ్యవసాయ పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతు కుటుంబాలు తొలకరి వర్షానికి మురిసిపోయి ముందస్తు పంటలను సాగు చేయడంతో నష్టాన్ని చవిచూస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశించాక 65 నుంచి 75 మిల్లీమీటర్ల శాతం వరకు వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనాలను నాటాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నప్పటికీ రైతులు తొందరపడి ముందస్తు సాగుకే మొగ్గుచూపారు.

జాడలేని వాన