
ఇసుక క్వారీ నిర్వహణకు ఆమోదం
మంగపేట: మండలంలోని వాడగూడెంలో శ్రీ నల్ల పోచమ్మతల్లి గిరిజన ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఇసుక క్వారీ నిర్వహణకు పెసా గ్రామ సభలో 115 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. కలెక్టర్, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు గ్రామంలోని 3వ ఇసుక క్వారీ నిర్వహణకు అర్హత కలిగిన రిజిస్టర్ గిరిజన లేబర్ సొసైటీని గుర్తించేందుకు పంచాయతీ ప్రత్యేకాధికారి, ఏఈఓ భావన అధ్యక్షతన పెసా గ్రామసభను సోమవారం నిర్వహించారు. గ్రామసభకు ఏటూరునాగారం ఐటీడీఏ పెసా జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. గ్రామంలోని 3వ ఇసుక క్వారీ నిర్వహణకు శ్రీ నల్లపోచమ్మతల్లి, పగిడిద్దరాజు సమ్మక్క–సారక్క సొసైటీలు పోటీపడ్డాయి. క్వారీ నిర్వహణ బాధ్యతలు తమకు కావాలంటూ పగిడిద్దరాజు సమ్మక్క, సారక్క సొసైటీ సభ్యులు కోరారు. దీంతో నల్లపోచమ్మ సొసైటీ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో కొంత వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఎస్సై సూరీ గొడవ పడకుండా గ్రామసభ నిర్వహించాలని సూచించారు. అనంతరం గ్రామసభకు హాజరు కావడం ఇష్టంలేదని పగిడిద్దరాజు సమ్మ క్క, సారక్క సొసైటీ సభ్యులు లేచివెళ్లిపోయారు. అయితే గ్రామంలో రెండు సొసైటీల్లో 200 మంది సభ్యులు ఉండగా కోరం ఉండాలంటే 66 మంది హాజరు కావాల్సి ఉంది. అందులో 115 మంది సభ్యులు హాజరు కావడంలో అధికారులు గ్రామసభను కొనసాగించారు. ఇసుక క్వారీ బాధ్యతలను నిర్వహించేందుకు శ్రీ నల్లపోచమ్మతల్లి సొసైటీని గుర్తిస్తూ పెసా నిబంధనల మేరకు చేతులు ఎత్తి ఆమోదం తెలిపారు. సభ్యుల తీర్మానం నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామని ప్రభాకర్ తెలి పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బద్రూనాయక్, ఎంపీ మమత, పంచాయతీ కార్యదర్శి వనజ, పెసా కోఆర్డినేటర్ మడి శోభన్ పాల్గొన్నారు.