
విషజ్వరాలపై అప్రమత్తం
ములుగు: వర్షాకాలంలో ప్రజలు ఎదర్కొనే విషజ్వరాలు మలేరియా, డెంగీ, చికెన్గున్యా, మెదడువాపు వంటి కీటకజనిత వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం వైద్య సిబ్బందితో ముందస్తు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కీటకజనిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్సీల వారీగా ర్యాపిడ్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. యాంటీ లార్వా, యాంటీ అడల్స్పై సమగ్ర కార్యాచరణ తయారు చేసుకోవాలన్నారు. హైరిస్క్ గ్రామాలను గుర్తించి దోమతెరల పంపిణీ, మలేరియా వ్యాధి నిర్ధారణ ఆర్డీటీ కిట్లు, డెంగీ నిర్ధారణ కిట్లను నిల్వ ఉంచుకోవాలన్నారు. వరదముంపు ప్రాంతాల్లోని ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గర్భిణుల జాబితాను ములుగు ఏరియా, ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు అందించాలన్నారు. పీహెచ్సీలలో మూడు నెలలకు సరిపడా అన్ని రకాల మందులను నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వాంతులు, విరేచనాలు, డయేరియా, జాండీస్పై ముందుచూపుతో మెదలాలని వివరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ గోపాల్రావు, జిల్లా ప్రధాన ఆస్పత్రుల సూపరింటెండెంట్ జగదీశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్, ప్రోగ్రాం అధికారులు పవన్కుమార్, వైద్యులు శ్రీకాంత్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర