
పుష్కరాల్లో పోలీసు జులుం!
కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతీనది పుష్కరాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల తీరు మారడం లేదు. భక్తుల పట్ల మర్యాదను మరిచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చాం.. మాకు ఏమి కాదనే భావనతో విధులు నిర్వర్తిస్తూ భక్తులకు శాపంగా మారారనే విమర్శలను పోలీసులు మూటకట్టుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలకు కళాకారులతో వచ్చిన ఓ ట్రావెల్ను కాళేశ్వరంలోని గుండం చెరువు వద్ద విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ నిలిపి వారిని దేవస్థానం ఆవరణకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. వారితో వాగ్వాదానికి దిగాడు. ‘కరీంనగర్ కమిషనరేట్లో విధులు నిర్వర్తిస్తాను.. నాకు ఏమి కాదు..వీడియో కూడా తీసుకొండి’ అంటూ ప్రస్తుత ప్రభుత్వంపై దుర్భాషలాడినట్లు తెలిసింది. సోమవారం దేవస్థానంలోకి వెళ్లడానికి వస్తున్న దేవాదాయశాఖ ఏడీసీ కేడర్ అధికారినితో అక్కడున్న ఎస్సై స్థాయి అధికారులు అడ్డుకొని అనుమతివ్వలేదు. ఆమెతో వాగ్వాదానికి దిగారు. పైగా పోలీసు, దేవాదాయ, ఉత్సవ కమిటీ, విలేకరుల సిఫారసులపై వచ్చిన వారిని కూడా ఇబ్బందులకు గురిస్తున్నారు.
నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా..
కాళేశ్వరం గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు వారి కుటుంబ సభ్యులతో పుష్కర స్నానానికి సరస్వతీఘాట్కు బైక్పై వెళుతుండగా ములుగు జిల్లాకు చెందిన ఓ ఎస్సై వారిని అడ్డుకున్నారు. పాస్లు ఉంటే పంపిస్తామన్నారు. కాళేశ్వరం గ్రామస్తులకు పాస్లు ఎక్కడ తీసుకురావాలనగా బైక్ కీ తీసుకున్నాడు. దీంతో అతని వదినతో మహిళ అని చూడకుండా ‘నిన్ను పోలీస్స్టేషన్లో కూర్చోబెడతా’ అంటూ పోలీసు జులుం ప్రదర్శించాడు. దీంతో వారు అక్కడే కాసేపు పోలీసు తీరుపై బైఠాయించడం వ్యతిరేకంగా నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఓ ఎమ్మెల్యే కాన్వాయ్ రావడంతో ఆయన వాహనానికి అడ్డువెళ్లగా ఏంటని ప్రశ్నించాడు. దీంతో జరిగిన విషయం తెలపడంతో ఆ ఎస్సైతో వాహనం తాళం చెవి ఇప్పించి వెళ్లాడు. కాగా, అతనిపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. దేవస్థానం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్, ఘాట్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్, ఎస్సైల స్థాయి వారితో ఆ శాఖకు అప్రతిష్ట జరుగుతుందని, ఐపీఎస్ స్థాయి అధికారులు ఎంత చెప్పిన వారి పోలిసింగ్ చూపెడుతున్నారని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్న భక్తులు
కాళేశ్వరం వాసులకు తప్పనితిప్పలు