
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఏటూరునాగారం/మంగపేట: జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏటూరునాగారంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని జీసీసీ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు గానీ సరైన రక్షణ, టార్పాలిన్లు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు కాక రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక ధాన్యం రాశుల వద్దనే నిరీక్షించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. అదే విధంగా మంగపేట మండలంలో గురువారం ఉదయం, రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగి చల్లబడింది. పలుచోట్ల రైతులు కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకొచ్చిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. హేమాచలక్షేత్రంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు వచ్చిన చిరువ్యాపారుల పరిస్థితి భారీ వర్షంతో అత్యంత దయనీయంగా మారింది. జాతరకు వచ్చే భక్తులకు విక్రయించి ఉపాధి పొందేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన చిరువ్యాపారులు స్వీట్లు, గాజులు, బొమ్మలు తదితర షాపులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో భారీ వర్షం రావడంతో సామగ్రిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం